BRAGCET Inter Results: ఏపీలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 3న వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రావిరాల మహేశ్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఆధార్ నెంబరు, పుట్టినతేదీ, ఫోన్ నెంబరు వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు పొందవచ్చు.

  


BRAGCET ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..


తాడేపల్లి లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రవేశ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం డా. మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని, పరీక్షకు 35,629 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. 


రాష్ట్రంలోని 164 గురుకుల జూనియర్ కాలేజీల్లో మొత్తం 13,560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు ఎస్సీలకు 75%, బీసీ-సి (ఎస్సీ-కన్వర్టెడ్ క్రిస్టియన్స్)లకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. వీటిలో ఐఐటీ మెడికల్ అకడమీలో ఎంపీసీ 300 సీట్లు, బైపీసీ 300 సీట్లు ఉన్నాయి. అంబేడ్కర్‌ గురుకులాల్లో బాలికలకు 9,280, బాలురకు 4,280 సీట్లు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి తెలిపారు. 


కొనసాగుతున్న 5వ తరగతి ప్రవేశ ప్రక్రియ..
రాష్ట్రంలోని వివిధ క్యాంపస్‌లలో అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 5వ తరగతికి సంబంధించి బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 22 నుంచి మొదటి దశ విద్యార్ధుల ఎంపిక నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను మార్చి 21న విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశాలకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా 10 మార్చి 2024న నిర్వహించిన పరీక్షకు 42,928 మంది విద్యార్ధులు హాజరైనట్లు ప్రకటించారు. అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయగా మిగిలిన సీట్లను జోన్ల వారీగా స్పాట్ అడ్మిషన్లలో భర్తీ చేస్తారు.


ALSO READ:


కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇదే
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఒకటో తరగతికి రిజిస్ట్రేషన్లు; రెండు, ఆపై తరగతుల వారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి ఫలితాలు విడుదలైన పది రోజుల తర్వాత పదకొండో తరగతి అడ్మిషన్లను చేపడతారు. ఇక 1వ తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1254 కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..