ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఐసెట్ - 2021 (ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల స్వీకరణ జూలై 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఐసెట్ పరీక్షలను సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11.30 వరకు & మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550, బీసీ అభ్యర్థులు రూ.600, ఓసీ అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (APSCHE) తరఫున విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్‌ శశిభూషణ్ రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు స్వీకరణ సహా మరిన్ని వివరాలను https://sche.ap.gov.in/icet సంస్థ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 




తెలంగాణ ఐసెట్ షెడ్యూల్‌..
తెలంగాణలో ఐసెట్‌ (TS ICET) - 2021 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభం కాగా, కరోనా తీవ్రత నేపథ్యంలో దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగించారు. తాజాగా వెల్లడించిన నోటిఫికేషన్ ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఆలస్య రుసుముతో ఆగస్టు 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TSCHE) తరఫున వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఐసెట్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షలను ఆగస్టు 19, 20 తేదీల్లో నిర్వహించనుంది.
ఏపీ ఈసెట్ పరీక్ష తేదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈసెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- AP ECET) - 2021 పరీక్ష తేదీ ఖరారైంది. ఏపీ ఈసెట్ పరీక్షను సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కాగా, తెలంగాణలో ఈసెట్ పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించనున్నారు.


AP ECET పరీక్ష తేదీ ఖరారు ..
సెప్టెంబర్ 21న AP EDCET..
ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్‌సెట్ ) - 2021 పరీక్షను సెప్టెంబర్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ వెంకటేశ్వరరావును నియమించారు. కాగా, తెలంగాణలో ఎడ్‌సెట్ - 2021 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. ఆగస్టు 24వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.