ఉండకూడని ఏడు వ్యసనాలు


దుర్వ్యసనం ఎంత గొప్పవాడినైనా అథఃపాతాళానికి తొక్కేస్తుంది. వ్యసనానికి లోనై జీవితంలో బాగుబడినవాళ్లు లేరు. ఇలాంటి వాళ్లు ఈ కాలంలో మాత్రమే కాదు పూర్వమూ ఉన్నారు…పురాణాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా దుర్య్వసనాలు ఏడు అని చెబుతారు. అవేంటంటే…




పరస్త్రీ వ్యామోహం
సప్తవ్యసనాల్లో మొదటిది పరస్త్రీ వ్యామోహం. ఈ వ్యసనంతో సర్వనాశనమైపోయిన వాళ్లని చూస్తూనే ఉన్నాం. అందరకీ తెలిసిన రావణుడే బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రీరామ పత్ని అయిన సీతాదేవిని అపహరించి కోరి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. అంతేకాదు…తన కుటుంబాన్ని, వంశాన్ని, అయినవారినీ, చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. అందుకే మనది కాని వస్తువైని…మనలో సగ భాగం కాని మనిషిపై వ్యామోహం పెంచుకుంటే మిగిలేది నాశనమే..




జూదం
జూదం అనే మాట వినగానే ఇప్పుడున్న జనరేషన్ కి పేకాట కళ్లముందు కనిపిస్తుంది. అదే పురాణకాలానికి వెళితే పాండవులు-కౌరవుల జూదం గుర్తొస్తుంది. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. మంచి చెడులు నిర్ణయించే అంత గొప్పవాడే ఆ రోజుల్లో తాను అవస్తలు పడడంతో పాటూ తమ్ముళ్లు, భార్య కష్టాలకు కూడా కారణమయ్యాడు. ఇక ఇప్పటి విషయానికొస్తే జూదానిక బానిసై  కుటుంబాలను రోడ్డున పడేస్తున్న వారెందరినో చూస్తున్నాం. 




మద్యపానం
మద్యపానం ఎంత ప్రమాదకరమో రాక్షసగురువైన శుక్రాచార్యుడే ఇందుకు ఉదాహరణ. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. చనిపోయిన రాక్షసులను ఆ విద్యతో వెంటనే బ్రతికించేవాడు. కానీ మద్యపాన మత్తులో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో  కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. కచుడంటే బృహస్పతి కుమారుడు. మృతసంజీవని విద్య నేర్చుకునేందుకు శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరతాడు. అలాంటి పరిస్థితుల్లో కడుపులో ఉన్న కచుడికి మృత సంజీవినీ విద్య నేర్పించి… శిష్యుడిని బతికించి.. ఆ తర్వాత శిష్యుడి ద్వారా మళ్లీ ప్రాణం పోసుకున్నాడు శుక్రాచార్యుడు. సకల విద్యలు తెలిసిన వారినే మద్యపానం అంత వినాశనం తీసకొస్తే…మానవమాత్రులం మనమెంత…..




వేట
వేట అనే మాట అప్పట్లో రాజులకు సంబంధించిన విషయం అయినప్పటికీ….ఇప్పటికీ స్థితిపరులకు ఇదో వ్యసనమే. ఈవేటలో పట్టుబడి కేసులు ఎదుర్కొంటున్న వారెందరో ఉన్నారు. ఇప్పుడు కోర్టులు శిక్షలు ఉంటే అప్పట్లో శాపాలుండేవి. దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి జంతువులను చంపేవాడు. ఓసారి నీటి శబ్దం విని బాణ వేసినప్పుడు శ్రవణకుమారుడు బలైపోతాడు. తనకు తెలియకుండా చేసినా పాపం పాపమే కదా. శ్రవణకుమారుడి వృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురైన దశరధుడు… వనవాసానికి వెళ్లిన శ్రీరాముడిని కలవరిస్తూ మరణిస్తాడు. మూగజీవాలను వేటాడితే శాపమో-శిక్షో తప్పదు…





కఠినంగా, పరుషంగా మాట్లాడటం
సప్తవ్యసనాల్లో ఇది ఐదవది. కఠినంగా, పరుషంగా మాట్లాడటం..ఎదుటివారిపై మాట విసరడం ఎంతో ప్రమాదకరం. మాటతీరు సరిగా లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు విఛ్చిన్నమవుతున్నాయి. మహాభారంతో దుర్యోధనుడు పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పట్లో దుర్భాషలాడేవారిని వేళ్లపై లెక్కెట్టేవారు…ప్రస్తుత సమాజంలో దుర్భాషలాడని వారిని వేళ్లపై లెక్కపెడుతున్నాం. అదీ తేడా…..




కఠినంగా దండించటం
దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి సరైన ఆహారం కూడా అందించకండా ఇబ్బంది పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు. ఎవరినైనా కఠినంగా దండించామని అహం సంతృప్తి చెందినా మళ్లీ అది ఎప్పటికైనా రివర్సవుతుందనేందుకు ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది.




డబ్బు
లక్ష్మీదేవిని నువ్వు గౌరవిస్తే…అమ్మవారు నిన్ను కరుణిస్తుందని అంటారు పెద్దలు. నిజమేకదా… క్రమశిక్షణ లేకుండా ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తాత్కాలిక ఆనందం పొందొచ్చుకానీ….శాశ్వత కష్టాలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం తప్పదు. ప్రస్తుతం రోజుల్లో అందరికీ క్రెడిట్ కార్డులు ఓ వ్యసనంగా మారింది. ఏదో డబ్బులు చెట్లకు కాస్తున్నట్టు…షాపింగులు, సినిమాలు, సరదాల పేరుతో కార్డులు గీకేస్తున్నారు. నిండా మునిగాక లబోదిబోమంటున్నారు. కొందరైతే ఆత్మహత్య చేసుకునే స్థాయివరకూ వెళుతున్నారు. అందుకే ధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలి…