దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష (NTSE)'ను కేంద్రం నిలిపివేసింది. కేంద్ర విద్యాశాఖ నుంచి ఆమోదం లభించే వరకు దాన్ని నిలిపివేస్తున్నట్లు  'నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ & ట్రైనింగ్‌' (NCERT) ప్రకటించింది. ఈ ఏడాది స్కాలర్‌షిప్‌ పథకం కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, అందువల్లే ప్రతిభావంతుల ఎంపిక నిమిత్తం నిర్వహించే పరీక్షను నిలిపివేసినట్లు NCERT తెలిపింది.


పదోతరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పరీక్ష నిర్వహించి చివరకు 2 వేల మందికి కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం అందజేస్తుంది. గతేడాది ఎన్‌టీఎస్‌ఈ-2021 నిర్వహిస్తామని ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటించడంతో ఆయా రాష్ట్రాలు రాష్ట్రస్థాయి పరీక్ష కోసం విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేశాయి. గత జనవరిలో పరీక్ష జరపాల్సి ఉండగా.. దాన్ని నిలిపివేయాలని ఎన్‌సీఈఆర్‌టీ నుంచి అకస్మాత్తుగా ఆదేశాలు వచ్చాయి. అప్పటి నుంచి పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పరీక్షకు 2021 మార్చి వరకే ఆమోదం ఉందని, తర్వాత పరీక్షల నిర్వహణకు అది ఇంకా రాలేదని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. అందువల్ల మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు పరీక్షను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే 2021కు పరీక్ష ఇక లేనట్లే.


సాధారణంగా ఏటా ఆగస్టు/సెప్టెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చి నవంబరు మొదటి ఆదివారం రాష్ట్రస్థాయి పరీక్ష జరుపుతారు. ప్రతిభ చూపినవారికి జాతీయస్థాయి పరీక్షను మే రెండో ఆదివారం నిర్వహిస్తారు. అక్టోబరు వచ్చినా ఇప్పటివరకు నోటిఫికేషన్‌ రానందున 2022కు కూడా పరీక్ష లేనట్లేనని భావిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులేమో 2021 మార్చి వరకే పరీక్షకు అనుమతి ఉన్నప్పుడు గత ఏడాది పరీక్ష జరపాలని నోటిఫికేషన్2 ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. పోయిన ఏడాది తెలంగాణలో దాదాపు 14వేల మంది నుంచి వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇస్తారా? లేదా? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.



Also Read:  నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!



రూ.2 వేల నుంచి 5 వేలకు పెంచే యోచనలో...

NTSE స్కాలర్‌షిప్ కింద ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.1250; డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.2000 ఇస్తున్న సంగతి తెలిసిందే. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని విద్యామంత్రిత్వశాఖ భావిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 2 వేల మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ ద్వారా ప్రయోజనం కలుగుతుంది. మొత్తం స్కాలర్‌షిప్స్‌లో 15 శాతం ఎస్సీ విద్యార్థులకు, 7.5 శాతం ఎస్టీ విద్యార్థులకు, 27 శాతం ఓబీసీ విద్యార్థులకు, 4 శాతం దివ్యాంగులకు అందిస్తున్నారు. మిగతా స్కాలర్‌షిప్స్ మిగతా కేటగిరీల వారికి అందిస్తున్నారు.


    దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని ప్రోత్సహించి ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రధానమైనది 'నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌ (ఎన్‌టీఎస్‌ఈ)'. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంటర్‌ నుంచి పీహెచ్‌డీ వరకు స్కాలర్‌షిప్ అందుకోవచ్చు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా రెండు వేల మంది ఈ ఉపకారవేతనాలను అందుకుంటున్నారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.



Also Read: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?


NTSE పరీక్ష విధానం:


మొత్తం రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి దశ (స్టేజ్-1) పరీక్షను రాష్ట్రస్థాయిలో, రెండో దశ (స్టేజ్-2) పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులను రెండోదశకు ఎంపిక చేస్తారు. ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీఈలు ఈ పరీక్షను నిర్వహిస్తాయి. కాగా మొదటి దశలో అర్హత సాధించిన వారికి రెండోదశ పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. స్టేజ్-1 పరీక్షకు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించాలి. స్టేజ్-2 పరీక్షకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఎవరు అర్హులు?
దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓపెన్, డిస్టెన్స్ విధానంలో పదోతరగతి చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిసారి పదోతరగతి పరీక్ష రాయనున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


Also Read:  ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం; రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ లింక్ ఇదే!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దేశంలోని రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సంబంధిత లైజన్ ఆఫీసర్లు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఆ మేరకు దరఖాస్తు పూర్తిచేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో సంబంధిత అధికారికి పంపాల్సి ఉంటుంది.


మొదటి దశ(స్టేజ్-1) పరీక్ష ఇలా..
✦ రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
✦ పేపర్-1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్), పేపర్-2 స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్).
✦ ఒక్కో పేపర్‌కు 100 మార్కులకుగాను మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
✦ ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయించారు.
✦ పేపర్-2లో సైన్స్-40, మ్యాథ్స్-20, సోషల్‌సైన్సెస్-40 ప్రశ్నలు అడుగుతారు.
✦ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు.
✦ పరీక్షలో అర్హత మార్కులను జనరల్, ఓబీసీలకు 40 శాతంగా.. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతంగా నిర్ణయించారు.



Also Read: EAMCET Counselling: ఎంసెట్(బైపీసి) కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!


రెండోదశ (స్టేజ్-2) పరీక్ష ఇలా..
✦ రెండ దశలోని రెండు పేపర్లు (మ్యాట్, శాట్) ఉంటాయి.
✦ ఒక్కో పేపర్‌కు 100 మార్కులకుగాను మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
✦ 9, 10 తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..