Jagananna Videshi Vidya Deevena : ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో వరం ప్రకిటంచింది. విదేశీ విద్య కోసం మరో పథకాన్ని అమ‌లులోకి తీసుకువ‌స్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జ‌గనన్న విదేశీ విద్యాదీవెనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పక్షపాతం లేకుండా ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వం చెల్లించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 100పై బడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయనుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించనుంది. 


చెల్లింపు ఇలా 


ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫస్ట్‌ సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు, రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు ఉంటాయ‌ని స్పష్టం చేసింది. నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంత వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంద‌ని వెల్లడించింది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది.


అర్హతలు 


జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంద‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ ఇస్తారు. సీఎస్ నేతృత్వంలో కమిటీ ఎంపిక చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. 2016-17 నుంచి లబ్దిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా ఉన్నాయని  ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ప్రభుత్వ సమయంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలకు వర్తింపచేయలేదని వెల్లడించింది. ఇప్పుడు అగ్రకులాల్లోని పేదలకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి వర్తింపు, ఇప్పుడు ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉన్నవారికీ వర్తింపు చేయనున్నారు. ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తింపు చేస్తున్నారు.  టాప్‌ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనున్నారు. 101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50 లక్షలు వరకూ ఫీజులను చెల్లించనున్నారు. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎంతమంది సీట్లు సాధించినా వర్తింపు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.