➥ కాలేజీలపై మారటోరియం ఎత్తివేత 


➥ అప్రూవల్‌ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసిన ఏఐసీటీఈ చైర్మన్‌ 


కొత్త ఇంజినీరింగ్‌ కాలేజీల ఏర్పాటుపై విధించిన మారటోరియాన్ని ఏఐసీటీఈ ఎత్తివేసింది. దీంతో కొత్త కాలేజీల ఏర్పాటుకు  పచ్చజెండా ఊపినట్లయింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారాం మార్చి 22న కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో 2023 -24 విద్యా సంవత్సరం అప్రూవల్‌ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ఈ ఏడాది ఆశావహ జిల్లాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. యాజమాన్యాలు నేషనల్‌ సింగిల్‌విండో సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 23 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని సీతారాం తెలిపారు. ఏప్రిల్‌ 6 వరకు కాలేజీల యజమాన్యాలు దరఖాస్తు చేసుకోవవచ్చని వెల్లడించారు.


కొత్త కోర్సులు అందుబాటులోకి..
ఈ విద్యాసంవత్సరం ఏఐసీటీఈ వివిధ కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. కోర్‌ కోర్సుల్లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేన్స్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. మైనర్‌ డిగ్రీ అయిన ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, ఫైర్‌ అండ్‌ లైఫ్‌ సేఫ్టీ కోర్సులున్నాయి. పీజీడీఎం కోర్సుల్లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ల్యాండ్‌ గవర్నెన్స్‌, వాటర్‌ అండ్‌ రివర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇన్నోవేషన్‌ ఎంట్రర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ వెంచర్‌ డెవలప్‌మెంట్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, 5జీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు అండర్‌ గ్రాడ్యుయేట్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది.


ఏఐసీటీఈ నూతన మార్గదర్శకాలు..
➥ అనుబంధ గుర్తింపు కోసం విద్యాసంస్థలు తప్పుడు సమాచారం ఇచ్చినా.. ఏవైనా ఫిర్యాదులు వస్తే గతంలో ప్రత్యేక కమిటీ తనిఖీలు చేపట్టేది. ఇప్పుడా నిబంధనను ఎత్తివేసి పూర్తిగా డాక్యుమెంట్ల ఆధారంగానే అనుమతులు ఇస్తారు.


➥ కొత్త కాలేజీల ఏర్పాటుకు అవసరమయ్యే భూ విస్తీర్ణం ఇక నుంచి ఒకే విధంగా ఉండనుంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్‌, మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఒక్కోరకంగా ఉండగా, ఇకనుంచి ఒకేలా ఉండనుంది.


➥ ఇంజినీరింగ్‌లో గరిష్ఠ సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచగా, ఎంసీఏ కోర్సుల్లో గరిష్ఠ సీట్ల సంఖ్యను 180 నుంచి 300కు పెంచారు.


➥ ఒకే ఒక్క కోర్సుతో నడుస్తున్న కాలేజీల్లో నిబంధనను సడలించి మల్టిపుల్‌ ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు.


➥ రెగ్యులర్‌ డిగ్రీతో సమానంగా 47 కోర్సులను మైనర్‌ డిగ్రీగా తీసుకునే వెసులుబాటును కల్పించింది.


➥ గతంలో ఒక విద్యాసంస్థలో 50 శాతం ఎన్‌రోల్‌మెంట్‌ నమోదైతేనే ఎమర్జింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. తాజాగా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.


➥ కాలేజీల్లో అమ్మాయిలు, మహిళా సిబ్బంది భద్రత కోసం 24/7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా సైకాలజిస్ట్‌లను నియమించుకోవాలి.


➥ ఎంబీఏ, పీజీడీఎం కోర్సులను విలీనంలో భాగంగా వసతుల కల్పనకు విధించిన గడువును మరో ఏడాదిపాటు పొడిగించారు.


➥ షిఫ్ట్‌ పద్ధతిలో నడుస్తున్న కాలేజీలు రెగ్యులర్‌గా మార్చుకునేందుకు మౌలిక వసతుల కల్పన గడువును 2023 -24 వరకు పొడిగించారు.


➥ అర్కిటెక్చర్‌, ఫార్మసీ కాలేజీలకు ఇక నుంచి ఏఐసీటీఈ అనుమతులివ్వదు. ఇక సంబంధిత కౌన్సిళ్ల నుంచే అనుమతులు పొందాలి.


➥ ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాలను ఈ విద్యాసంవత్సరం నుంచి మూసివేస్తారు. కాలేజీలు అన్నిరకాల అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారానే పొందాల్సి ఉంటుంది.


➥ క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో 500లోపు, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో 100లోపు విద్యాసంస్థలు మాత్రమే గతంలో విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం, ట్విన్నింగ్‌, జాయింట్‌ డిగ్రీలు ప్రవేశపెట్టే అవకాశముండేది. 


➥ తాజాగా క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ వెయ్యిలోపు, 650 పాయింట్లతో ఎన్‌బీఏ అక్రెడిటేషన్‌, టాప్‌ 100 ఏఐసీటీఈ ర్యాంకింగ్‌ కాలేజీలు సైతం విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యమయ్యే అవకాశం ఇచ్చారు.


➥ ప్రతిభావంతులైన విద్యార్థులకు రెండు సీట్లు, కరోనాతో తల్లిదండ్రులు మృతిచెందిన పిల్లలకు పీఎం కేర్స్‌ స్కీం ద్వారా సూపర్‌ న్యూమరరీ కోటాలో సీట్లను నిరుడు కేటాయించగా, తాజాగా ఈ రెండు నిబంధనలను తొలగించారు.


Also Read:


సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023)‌ నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల స్కోరు కార్డులను మార్చి 21న విడుదల చేసింది. స్కోరుకార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. 
గేట్-2023 స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..