శ్రీ సత్య సాయి జిల్లాలో దారుణం జరిగింది. హిందూపురం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్యకు గురవడం పట్టణంలో కలకలం రేపుతోంది. తన ఇంటి ముందు కారులో దిగుతుండగా కళ్లల్లో కారం పొడి చల్లి, ఆపై వేట కొడవళ్ళతో నరికి  దారుణంగా హత్య చేశారు. ఆయన శరీరంపై 18 చోట్ల నరికిన కత్తిపోట్లు ఉన్నాయంటే ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. తన ఇంటి ముందే దారుణహత్యకు గురి కావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.


అసలేం జరిగిందంటే..
వైసీపీ నేత రామకృష్ణారెడ్డి చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దులో దాబా నడుపుతున్నారు. రోజులాగే శనివారం రాత్రి సైతం దాబా మూసివేసి కారులో ఇంటికి చేరుకున్నారు. కారు డోర్ తెరిచి కిందకి దిగగానే కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను చుట్టుముట్టారు. మొదట కళ్లల్లో కారం పొడి చల్లారు. ఆ వెంటనే తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో రామకృష్ణారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగుల దాడిలో వైసీసీ నేత కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో వైసీపీ నేత అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.


రెండు బైకులపై మొత్తం ఐదుగురు దుండగులు వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు బైకులపై రెడీగా ఉండగా, మిగతా నిందితులు వేట కొడవళ్లతో రామకృష్ణారెడ్డిని విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. ఆయన శరీరంపై 18 చోట్ల నరికినట్లు తెలుస్తోంది. హత్య చేసిన వెంటనే నిందితులు అదే బైకులపై పరారయ్యారు. ప్లాన్ ప్రకారం హత్యకు రావడంతో నిందితులు తమను ఎవరూ గుర్తించకూడదని, ముఖాలకు మాస్కులు ధరించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 


ఎమ్మెల్సీ ఇక్బాల్ హస్తం ఉంది: కుటుంబం ఆరోపణలు
తన కుమారుడి హత్యకు కారణం ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన సహాయకుడు గోపి, చాకలి రవి, నంజుండ రెడ్డి, మురళి, కేపీ నాగుడు తదితరుల హస్తం ఉన్నట్లు మృతుడు రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్సీ పీఏపై రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేశారు. గ్రామీణ మండల సీఐ జీటీ నాయుడుపై జాతీయ బాలల హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేయడం, స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న రోజు గ్రామంలో జాతీయ పతాకం ఎగురవేసే విషయంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులకు, రామకృష్ణారెడ్డికి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ వివాదం సమయంలో రామకృష్ణారెడ్డిని హతమారుస్తామని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. వైసీపీ నేత రామకృష్ణారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.