YSR Kadapa District News: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు పగుల గొట్టి  బంగారు నగల చోరీకి పాల్పడిన ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు అరెస్టు చేసి, చోరీ చేసిన సొమ్మును రికవరీ చేశారు. చోరీ సొమ్ముతో ఉడాయించిన ఇద్దరు దుండగులను సీసీ టీవీ ఫుటేజీ  ఆధారంగా, బనగాన పల్లెలో ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం ఇచ్చిన వారి వివరాలు, ఫోన్ నంబర్ ఆధారంగా ఇరువురిని అరెస్టు చేశారు.


అసలేం జరిగిందంటే..?


గత నెల 26న ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నెహ్రూ రోడ్డులోని చంద్ర ఓబుల రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని బంగారు నగలను ఎత్తుకెళ్లారు. తిరుమలకు వెళ్లి రెండు రోజుల తరువాత వచ్చిన చంద్ర ఓబుల రెడ్డి కుటుంబ సభ్యులకు తలుపులు పగుల గొట్టి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అనేక చోరీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెంకటేశ్, హవాలా డబ్బు కోసం హైదరాబాద్ లో హత్య కేసులో నిందితుడు మస్తాన్ లు ఈ చోరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కేకే అన్బు రాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.


ఇదే జిల్లాలో నిన్నటికి నిన్న బ్లూడార్ట్ కంపెనీ లారీ లోడు దొంగల అరెస్ట్


ఏపీలో ఇటీవలే జరిగిన భారీ చోరీ కేసును వైఎసార్ కడప జిల్లా పోలీసులు ఛేదించారు. బ్లూడార్ట్ ద్వారా హర్యానా టూ చెన్నై కంటైనర్ లో తరలిస్తున్న ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఇద్దరు అంతరాష్ట్ర నేరస్థులు కొట్టేశారు. వారిని  పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. పరారీలో ఉన్న నలుగురు నేరస్థులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరి నుంచి రూ.1.58 కోట్ల విలువైన 1557 రెడ్ మి సెల్ ఫోన్లు, 4 యాపిల్ ఐఫోన్ 14 మోడల్ సెల్ ఫోన్లు, 5 ల్యాప్ ట్యాప్ లు, 193 బ్లూ టూత్ లు, ఆడి, ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లూ డార్ట్ కంపెనీ ఫిర్యాదుపై గత నెల 30వ తేదీన చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 


అసలేం జరిగిందంటే..?


ఈనెల 19వ తేదీన మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులతో బ్లూడార్ట్ కంపెనీకి చెందిన ఒక కంటైనర్ లారీ నెం. HR38-Y-3224, హర్యానా రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నుంచి చెన్నైకి బయలుదేరింది. సదరు లారీని జుబెర్, క్లీనర్ వాసిమ్ నడుపుతుండగా.. 23వ తేదీన బ్లూ డార్ట్ ఎక్స్ ప్రెస్ లిమిటెడ్ మేడ్చల్ కు చేరుకుంది. అక్కడ కొన్ని సరకులు తీసుకొని హైదరాబాద్ గోడౌన్ కు చేరుకుంది. అక్కడ మరికొన్ని సరకులు తీసుకొని  చెన్నై వెళ్లేందుకు బయలుదేరారు.
మార్గమధ్యంలో YSR కడప జిల్లాకు చెందిన దువ్వూరు మండలం గుడిపాడు గ్రామ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద ముద్దాయిలు కంటైనర్ లారీని ఆపి తాళాలు పగులగొట్టి కంటైనర్‌లో ఉన్న 1,68,58,671 రూపాయల విలువ చేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగలించుకు పోయారు. 


హైదరాబాద్‌లోని బ్లూడార్ట్ ఎక్స్ ప్రెస్ లిమిటెడ్‌లో సీనియర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న  శివ ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 30వ తేదీన చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న వైఎస్సార్ కడప జిల్లా, ఎస్పీ, కె.కె.అన్బురాజన్.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. సీసీ టీవి ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించారు.