Nizam Students Protest: నిజాం కళాశాల విద్యార్థినులు మరోసారి ఆందోళన నిర్వహించారు. నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు హాస్టల్ కల్పించకపోవడం సమస్య పైన మంత్రి కే తారక రామారావు స్పందించి.. సమస్య తీర్చాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు మాత్రమే హాస్టల్ సదుపాయం కల్పిస్తామని చెప్పి ప్రిన్సిపాల్ చేతులు ఎత్తేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇంత ఇబ్బందులు పడుతున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం మరీ దారణం అన్నారు. 


ఇటీవలే స్పందించిన మంత్రి కేటీఆర్..


హైదరాబాద్ నిజాం కళాశాల విద్యార్థినిలు గత కొంత కాలంగా చేస్తున్న ఆందోళనపై ఇటీవలే మంత్రి కేటీఆర్ స్పందించారు. వసతి గృహ సౌకర్యం కల్పించాలని కోరుతూ.. అడర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ధర్నా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి వివరాలు అఢిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని ఆమెను కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కళాశాల ప్రిన్సిపల్ ను ఆయన ఆదేశించారు. 






మూడ్రోజుల క్రితమే హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ కార్యాలయంలో విద్యార్థుల బైఠాయింపు ఉద్రిక్తతగా మారింది. నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్ ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థినులు ప్రిన్సిపాల్ తో వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజుల సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ప్రిన్సిపాల్.. ఎవరికీ తెలియకుండా పీజీ విద్యార్థినులకు హాస్టల్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


తమకు స్పష్టమైన హామీ ఇఛ్చే వరకు ఆదోళనను ఆపబోమంటూ  విద్యార్థినులు కార్యాలయంలోనే బైఠాయించి ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులలకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ ఇదే అంశంపై స్పందించి.. విద్యార్థుల సమస్యను వెంటనే తీర్చాలని ప్రిన్సిపాల్ కు ఆదేశాలు జారీ చేశారు.