Youtuber Harsha Sai Victim Lawyer Key Comments: కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని హర్షసాయి (Harshasai) కేసులో బాధితురాలి తరఫు లాయర్ నాగూర్ బాబు మండిపడ్డారు. యూట్యూబర్ హర్షసాయి కేసుకు సంబంధించి బాధితురాలిపై చేస్తోన్న ప్రచారంపై ప్రొడ్యూసర్ బాలచంద్రతో కలిసి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడా చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనేది ఎవరికీ తెలియదు. రూ.2 కోట్ల కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. ప్రస్తుతం హర్షసాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయినా అతనికి సపోర్ట్‌గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంస్టాగ్రామ్ పేజెస్‌ని వాడుకుంటూ కేసును తారుమారు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. బాధితురాలిపై లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్‌తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారు.' అంటూ న్యాయవాది మండిపడ్డారు.


కానీ, కొన్ని మీడియా ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా వాటిని ఎంటర్టైన్ చేస్తూ బాధితురాలిని ఇబ్బంది పెడుతున్నారని నాగూర్ బాబు అన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. 'ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారో డిలీట్ చేయాల్సిందిగా ధర్మాసనం నుంచి ఇంటెరిమ్ ఆర్డర్ తెచ్చుకున్నాం. అదే విధంగా ఎఫ్ఐఆర్‌లో ఫైల్ అయిన కంప్లైంట్ ఏంటో తెలియకుండా కొంతమంది వాదనలకు దిగి ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌తో బాధితురాలిని మానసికంగా బాధ పెడుతున్నారు. అలా చేస్తున్న సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశాం. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ పైన కేసు నమోదు చేశాం. సెక్షన్ 356 కింద డిఫర్మేషన్, 72 ఆఫ్ బి ఎన్ ఎస్ కింద కేసులు నమోదు చేశాం. బాధితురాలి పేరు ఎక్కడ కూడా నిజనిర్ధారణ జరిగే వరకు తీయకుండా న్యాయస్థానం నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాం' అని తెలిపారు.


'మానసిక వ్యధకు గురి చేస్తున్నారు'


బాధితురాలు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టారని.. ఆ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌తో ఆమెను ఎంకో మానసిక బాధకి గురి చేస్తున్నారని నిర్మాత బాలచంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'కేసు పెట్టిన రెండో రోజు నుంచే హర్షసాయి ఇబ్బంది పెడుతున్నాడు. దాని కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌ని నిజానిజాలు తెలియకుండా ఎవరు ఎక్కడ చూపించరాదని న్యాయస్థానం ఆర్డర్ పాస్ చేసింది' అని పేర్కొన్నారు.


హర్షసాయికి లుక్ అవుట్ నోటీసులు


అటు, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్షసాయిపై నార్సింగి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గత నెలలో అతనిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డాడని ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సోషల్ మీడియాలో తనపై ఉద్దేశపూర్వకంగానే ట్రోలింగ్ చేయిస్తున్నాడని మరో ఫిర్యాదును చేశారు. తనపై అసత్యాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి పలు స్కీన్ షాట్లను పోలీసులకు సమర్పించగా.. దీనిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం గాలిస్తున్నారు. 


Also Read: Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్‌‌తో అప్పుల పాలు, ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య