Young Man Killed Girl In Kurnool District: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. అటు, కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమ పేరుతో ఓ మృగాడు రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదని బాలికకు నిప్పంటించాడు. మరోవైపు, తూ.గో జిల్లాలో ఓ వివాహితకు ఓ వ్యక్తి ఇన్ స్టా ద్వారా పరిచయం కాగా.. అతనికి డబ్బులు ఇచ్చింది. ఈ క్రమంలో వాటిపై కుటుంబంలో కలహాలు మొదలు కావడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనల్లో ఆయా ప్రాంతాల్లో స్థానికంగా తీవ్ర విషాదం నింపడం సహా ఆందోళన కలిగించాయి.


పురుగుల మందు తాగించి..


కర్నూలు జిల్లాలో (Kurnool District) ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించాలని ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె నోట్లో పురుగుల మందు పోసి పరారయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పరి మండలం నగరూరులో చిన్న వీరేశ్ అనే యువకుడు ఓ ఇంటర్ విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించాడు. పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోన్న విద్యార్థిని.. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే తనను ప్రేమించాలని విద్యార్థినిని వేధించాడు. ఇక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఈ పెనుగులాటలో వీరేశ్‌కు కూడా గాయాలయ్యాయి. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసే సరికి బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో వేధించిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


బాలికపై హత్యాయత్నం


అటు, కడప జిల్లా (Kadapa District) బద్వేల్‌లో శనివారం మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. బాలికను ప్రేమ పేరుతో వేధించిన యువకుడు ఆమెకు నిప్పంటించాడు. బద్వేల్‌ రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలో విగ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. శనివారం బాలికను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. అతని చెప్పిన దానికి విద్యార్థిని అంగీకరించకపోవడంతో ఆమెకు నిప్పంటించాడు. హైవేపై కొన ఊపిరితో ఉన్న బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇన్ స్టా పరిచయంతో..


ఇన్ స్టా పరిచయం ఓ వివాహిత నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇన్ స్టాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య చాలా కాలం ఛాటింగ్ నడిచింది. ఈ సమయంలోనే వివాహితను సదరు వ్యక్తి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. అతని మైకంలో పడిపోయిన వివాహిత.. ఆమె దగ్గర ఉన్న విలువైన బంగారు నగలతో పాటు రూ.4 లక్షల నగదును కూడా ఇచ్చేసింది. అయితే, బంగారు నగలపై ఇంట్లో వాళ్లు ప్రశ్నించడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత వద్ద డబ్బులు దండుకున్న వ్యక్తి విశాఖకు చెందినవాడిగా గుర్తించారు. నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు. నిందితుడు గతంలో ఇంకెవరినైనా మోసం చేశాడా.?. అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Vizianagaram : భూగర్భ జలాలూ కలుషితం - విజయనగరం జిల్లా గుర్లలో డయోరియా మరణాలు