Crime News in Telugu:


యూపీలో దారుణం..


యూపీలోని బాఘ్‌పట్‌లో దారుణం జరిగింది. టీ తీసుకురావాలని అడిగినందుకు ఓ మహిళ భర్త కళ్లలో కత్తెరతో దారుణంగా పొడిచింది. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి భయపడిన ఆ మహిళ వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. మూడేళ్ల క్రితమే వీరికి వివాహమైంది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త తనను పదేపదే వేధిస్తున్నాడని ఫిర్యాదు కూడా చేసింది ఆ మహిళ. మూడు రోజుల క్రితమే ఈ కంప్లెయింట్ ఇచ్చింది. ఇప్పటికే ఇద్దరి మధ్యా విభేదాలుండడం వల్ల భర్తపై కోపం పెంచుకుంది నిందితురాలు. టీ అడిగినందుకు వెంటనే దాడి చేసింది. చేతికి అందిన కత్తెరతో కళ్లలో పొడిచింది. బాధితుడు గట్టిగా కేకలు పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నిందితురాలు పరారైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. విచారణ కొనసాగిస్తున్నారు. 


ఘజియాబాద్‌లోని భోజ్‌పుర్ గ్రామంలో దారుణం జరిగింది. అడిగిన టైమ్‌కి టీ ఇవ్వలేదన్న కోపంతో భార్య తల నరికేశాడో భర్త. కత్తితో మెడపై వేటు వేశాడు. ఈ ఘటనలో 52 ఏళ్ల మహిళ మృతి చెందింది. టీ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలోనే విచక్షణ కోల్పోయి కత్తితో నరికేశాడని పోలీసులు వెల్లడించారు. టీ తీసుకురావాలని నిందితుడు భార్యని అడిగాడు. కాస్త ఆలస్యమవుతుందని ఆమె బదులు చెప్పింది. ఈ విషయంలోనే ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ సమయంలో నలుగురు పిల్లలూ తమ గదిలో నిద్రపోతున్నారు. కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. నేరుగా మెడపై వేటు వేశాడు. ఈ వేటుకి బాధితురాలు గట్టిగా కేకలు పెట్టి కింద పడిపోయింది. ఆమె కేకలు విని చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ హత్య జరిగింది. లైంగిక కోరిక తీర్చలేదన్న కోపంతో లివిన్ పార్ట్‌నర్‌ని కత్తెరతో పొడిచి దారుణంగా చంపాడో వ్యక్తి. వారం రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే హత్య వెనకాల కారణాలు బయటపడ్డాయి. డిసెంబర్ 9వ తేదీన పోలీసులు డెడ్‌బాడీని గుర్తించారు. ఇంటికి తాళం వేసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి పేరు ప్రవీణ్ సింగ్‌గా గుర్తించారు. ప్రవీణ్‌ సింగ్‌, బాధితురాలు కొద్ది రోజులుగా ఆ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. తన లైంగిక కోరిక తీర్చాలని ఆ యువతిపై ఒత్తిడి తీసుకచ్చాడు ప్రవీణ్ సింగ్. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. ఈ కోపంతోనే కత్తెరతో మెడపై కిరాతకంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 


Also Read: కరోనా కొత్త వేరియంట్‌పై ఢిల్లీ ఎయిమ్స్‌ గైడ్‌లెన్స్, నిర్లక్ష్యం చేయొద్దని వార్నింగ్