Woman Doctor Assaulted: ముంబయిలో ఓ మహిళా వైద్యురాలిని ఓ రోగి వేధించాడు. ఆ పేషెంట్‌తో పాటు వచ్చిన బంధువులూ ఆమెని ఇబ్బంది పెట్టారు. ఆ రోగి మద్యం మత్తులో మహిళా డాక్టర్‌ని వేధించినట్టు విచారణలో తేలింది. ఇప్పటికే కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. మహిళా వైద్యులకు భద్రత లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటన జరగడం స్థానికంగా అలజడి రేపింది. వార్డ్‌లో డ్యూటీ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అక్కడి వైద్యులు వెల్లడించారు. ఓ వ్యక్తి ముఖంపై గాయాలతో హాస్పిటల్‌కి వచ్చాడని, అతనితో పాటు మరి కొందరు ఉన్నారని చెప్పారు. వైద్యం అందించే సమయంలో ఆ డాక్టర్‌ని ఆ పేషెంట్ వేధించాడని, చంపేస్తానని బెదిరించాడని వైద్యులు వివరించారు. మొత్తం ఆరుగురు ఉన్నారని, వాళ్లంతా కలిసి ఆమెపై దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఆమె బయపడిందని చెప్పారు. ఈ దాడిలో ఆమెకి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ఆరుగురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని పెద్ద ఎత్తున వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని హాస్పిటల్స్‌లోనూ భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. 


కోల్‌కత్తా ఘటనను మరిచిపోక ముందే దేశంలో ఏదో ఓ మూల ఈ తరహా దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో ఓ నర్స్‌పై దారుణంగా అత్యాచారం చేసి చంపాడో వ్యక్తి. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా అడ్డగించి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడం వల్ల ఇనుప రాడ్‌తో తలపై గట్టిగా కొట్టాడు. చున్నీతో ఉరి బిగించి హత్య చేశాడు.  యూపీలోని ఓ ఖాళీ ప్రదేశంలో మృతదేహాన్ని పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు చివరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. యూపీలోని చెట్ల పొదల్లో ఆమె డెడ్‌బాడీ గుర్తించారు. యూపీలోని సహరన్‌పూర్‌లో ఓ 11 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో చాక్లెట్ ఆశ చూపించి దారుణానికి ఒడిగట్టాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోమ్‌కి తరలించారు. 


ఇప్పటికే దేశవ్యాప్తంగా కోల్‌కత్తా ఘటనపై ఆందోళనలు జరుగుతున్నాయి. వైద్యులు 24 గంటల పాటు సేవలు బంద్ చేసి నిరనస వ్యక్తం చేశారు. వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కేంద్రం ఈ పరిణామాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వాలని అలెర్ట్ చేసింది. ప్రతి రెండు గంటలకు ఓ సారి శాంతి భద్రతలకు సంబంధించి రిపోర్ట్‌ పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. 


Also Read: Kolkata: ట్రైనీ డాక్టర్‌కి హాస్పిటల్‌ రహస్యాలు తెలిశాయా! అందుకే ఇంత దారుణంగా చంపారా - ఏంటీ మిస్టరీ?