Dowry Harassment: వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వరకట్నం అడగడం నేరమని తెలిసినా చాలా మంది యథేచ్ఛగా కట్నం అడుగుతున్నారు. పెళ్లికి ముందు ఇచ్చినంత తీసుకోవడం లేదా ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగక పోతే అదనంగా కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. తీవ్రంగా చిత్రహింసలు పెడుతున్నారు. అటు భర్త, ఇటు అత్తమామలు, ఆడ పడచులు తీవ్రంగా వేధిస్తున్నారు. కట్నం తీసుకురావాలని శారీరకంగా వేధిస్తున్నారు. కట్నం తీసుకురావాలంటూ భార్యలను భర్తలు తీవ్రంగా కొడుతున్నారు. వారు పెట్టే హింస భరించలేక చాలా మంది మహిళలు తనువు చాలిస్తున్నారు. 100 మందిలో ఒకరో, ఇద్దరో మాత్రమే భర్తలు, అత్తింటి వారిపై పోలీసు కేసు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో వరకట్న వేధింపులు భరించలేక మరో మహిళ తనువు చాలించింది. 


వేధింపులు భరించలేక సునీత ఆత్మహత్య


హైదరాబాద్ శివారు గచ్చిబౌలి శివారులో సునీత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం తీసుకు రావాలంటూ భర్త, అత్త మామలు ఆమెను తీవ్రంగా వేధించారు. శారీరకంగా, మానసికంగా ఆమెను హింసించారు. సునీతను భర్త తీవ్రంగా కొట్టేవాడు. ఈ వేధింపులు భరించలేకే సునీత సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 


కారు కొంటా రూ.10 లక్షలు తీసుకురా..


సునీతతో భర్త రమేశ్ నిత్యం గొడవ పడేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని హింసించే వాడు. మొదట్లో కట్నం తీసుకురావాలని మెల్లిగా అడిగాడు. తర్వాత కొద్దిగా స్వరం పెంచాడు. అనంతరం సూటిపోటి మాటలతో గుచ్చే వాడు. భర్త అంతగా ఇబ్బంది పెడుతున్నా తల్లిదండ్రులకు తన సమస్య గురించి చెప్పలేదు సునీత. మౌనంగా భర్త వేధింపులను భరించింది. సునీత దారికి రాకపోవడంతో రమేశ్ సునీతను శారీరకంగా వేధంచడం ప్రారంభించాడు. కట్నం తీసుకు వస్తావా లేదా అంటూ జుట్టు పట్టుకుని కొట్టేవాడు. రూ. 10 లక్షలు తీసుకురావాలని, వాటితో కారు కొంటానంటూ కొట్టేవాడు. రమేశ్ ను వారించాల్సిన అతని తల్లిదండ్రులూ రమేశ్ వెంటే నిలిచారు. రమేశ్ శారీరకంగా హింసిస్తే.. వాళ్లు మాటలతో మానసికంగా హింసించారు. 


ఇక భరించలేనంటూ సునీత కన్నీటి పర్యంతం..


భర్త, అత్తమామలు పెట్టే టార్చర్ రోజురోజుకూ ఎక్కువ కావడంతో సునీత ఇక దాచుకోలేక పోయింది. తనను తీవ్రంగా కొడుతున్నాడని, హింసిస్తున్నాడని, అత్తమామాలు మాటలతో వేధిస్తున్నారని తల్లిదండ్రులతో చెప్పుకుంది. బాధనంతా చెప్పుకుని కన్నీటి పర్యంతం అయింది. ఆ తర్వాత సునీత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో సునీత తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. భర్త, అత్తమామలు తనను ఏమైనా చేశారా అని వారిని భయం చుట్టుముట్టింది. హుటాహుటినా వెళ్లి చూడగా సునీత ఫ్యాన్  కు ఉరేసుకుని కనిపించింది. తల్లిదండ్రులు వచ్చే సరికే సునీత ప్రాణాలు గాలిలో కలిశాయని ఆమె తల్లిదండ్రులు విలపించారు. 


కట్నంగా బంగారం, 14 లక్షలు, 20 సెంట్ల భూమి..


విజయనగరానికి చెందిన సునీతకు అదే ప్రాంతానికి చెందిన రమేశ్ తో 2019లో పెళ్లి జరిగింది. రమేశ్ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో రమేశ్ కు బంగారంతో పాటు రూ.1 4 లక్షలు నగదు, 20 సెంట్ల భూమి ఇచ్చారు. అయినా రమేశ్ అదనపు కట్నం కోసం వేధించాడు.