Woman Commits Suicide: లోన్‌యాప్‌లో అప్పు తీసుకున్న ఓ మహిళ యాప్ నిర్వాహ‌కుల మోసానికి బ‌లైంది. వాళ్ల వేధింపులు తట్టుకోలేక, అప్పు తీర్చలేక బ‌ల‌వ‌న్మ‌రణానికి పాల్ప‌డింది. కుటుంబానికి మంచి చేద్దామ‌నుకుని ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది. భర్తకు తెలియకుండా లోన్ తీసుకుంది. ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంది. ‘బావా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నా ముఖం నీకు ఎలా చూపించగలను? అప్పు తీసుకుని మోసపోయాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’.. అంటూ భర్తకి సెల్ఫీ వీడియో పంపింది. ఈ దారుణ ఘ‌ట‌న కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటు చేసుకుంది. దీంతో ఆమె ఇద్ద‌రు పిల్ల‌లు అనాథలయ్యారు.

  


మంటాడ మండ‌లం కృష్ణాపురానికి చెందిన పేటేటి స్రవంతి(28)కి ఆమె మేనత్త కొడుకు శ్రీకాంత్‌తో వివాహమైంది. అతడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ స‌మ‌యంలో త‌న ఫోన్‌కు రూ. 5 ల‌క్ష‌లు లోన్ ఇస్తామ‌ని ఒక మెసేజ్ వ‌చ్చింది. క‌ష్ట‌కాలంలో చేదోడుగా ఉంటాయ‌ని న‌మ్మిన స్ర‌వంతి ఆ నెంబ‌ర్‌కు కాల్ చేసింది. లోన్ కావాలంటే ముందుగా రూ. 20 వేలు క‌ట్టాల‌ని చెప్పారు. ఆ రూ. 20 వేలు క‌ట్టినా ఇవ్వ‌కుండా మ‌రో రూ. 60 వేలు చెల్లించాల‌ని చెప్పారు. ఆమె ఆ డబ్బును కూడా చెల్లించింది. అయినా లోన్ ఇవ్వ‌క‌పోవ‌డంతో వారికి కాల్ చేస్తే మ‌రో రూ. 80 వేలు క‌డితే డ‌బుల్ అమౌంట్ ఇస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. నా డ‌బ్బు నాకు ఇవ్వాల‌ని వారిని బ‌తిమాల‌కుకుంది. అయినా వారు స్పందించ‌లేదు. రూ. 1.20 ల‌క్ష‌లు చెల్లిస్తేనే నీ డ‌బ్బు నీకు తిరిగిస్తామ‌ని బెదిరించ‌డంతో మోస‌పోయిన‌ట్టు తెలుసుకుంది.


అనాథలుగా చిన్నారులు 


అస‌లే కష్టాల్లో ఉన్నాను, పైగా ఇప్పుడు లోన్ యాప్‌తో మ‌రింత మునిగిపోయాన‌ని బాధ‌పడింది. ఈ విష‌యం త‌న భ‌ర్త‌కు తెలిస్తే తిడ‌తాడ‌న‌ని త‌న‌లో తానే మ‌ద‌న‌ప‌డింది. ఏం చేయాలో అర్థం కాక భ‌ర్త‌కు ముఖం చూపించ‌లేక అవ‌మానభారం, భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. కానీ చనిపోయేముందు జ‌రిగిన అన్యాయాన్ని భ‌ర్త‌కు సెల్ఫీ వీడియో రూపంలో పంపి త‌నువు చాలించింది. ఈ ఘ‌ట‌న‌తో త‌న ఇద్ద‌రు చిన్నారులు త‌ల్లి లేనివార‌య్యారు. ఈ సంఘ‌ట‌న ఆదివారం జ‌ర‌గ్గా బాధితురాలిని చికిత్స నిమిత్తం ఉయ్యూరు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స్ర‌వంతి ఆరోగ్యం మ‌రింత విష‌మించి ఆస్ప‌త్రిలో త‌నువు చాలించింది. త‌ల్లిని విగ‌త‌జీవిగా చూసిన చిన్నారులు ఏమైందో తెలియ‌క క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. ఆమె మ‌ర‌ణానికి కార‌ణం వివ‌రిస్తూ పెట్టిన సెల్పీ వీడియోను పోలీసులు తీసుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.