Chandrababu in AP Assembly: ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఆ కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టుకోలేకపోతున్నామని అన్నారు. అందుకే కాస్త సమయం తీసుకొని బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు. కనీసం రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు. 


రాష్ట్ర బడ్జెట్ అంశంపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సమయంలో దేశంలో పెనుమార్పులు సంభవించాయని గుర్తు చేశారు. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో విజన్‌ 2020 తయారు చేసి, దానికి అనుగుణంగా పని చేశామని చెప్పారు. ఆ రోజుల్లోనే అభివృద్ధి ప్రారంభించామని గుర్తు చేశారు. అలా ఐటీ రంగానికి బాగా ప్రాధాన్యం ఇచ్చామని.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో వివిధ రంగాల్లో చాలా ముందుకు వచ్చామని చెప్పారు. ఇవాళ తెలుగువాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి వచ్చింది. వికసిత్‌ భారత్‌ 2047కు ప్రపంచంలోనే భారత్‌ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.