భర్త ఇంట్లో భోజనం చేయడం లేదని ఓ ఇల్లాలు సూసైడ్ చేసుకుంటే.. మానసి ఆరోగ్యం బాగాలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు మరణాలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.  


బంజారాహిల్స్ ఏరియాలో జరిగిన సూసైడ్ మరీ విచిత్రంగా ఉంది. భర్త ఇంట్లో భోజనం చేయడం లేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ గౌరీ శంకర్‌ నగర్‌లో జరిగిందీ ఘటన. ఈ ప్రాంతంలో ఉండే సంగీత, సంజీవ్‌ మధ్య నాలుగు రోజుల క్రితం చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి భర్త కోపంతో ఉన్నాడు. ఆమె వండి పెట్టింది తినడం మానేశాడు. ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు. 


భర్త అలా నాలుగు రోజుల నుంచి తిండీ తిప్పలు లేకుండా తనతో మాట్లాడకుండా ఉండటంతో భార్య సంగీత భరించలేకపోయింది. ఎంత బతిమాలినా దారికిరావడం లేదని మానసికంగా తీవ్ర కలత చెందింది. అంతే ఎవరూ లేని సమయంలో ప్రాణం తీసుకుంది. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 


విషయం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసుకోవడం ఏంటని బోరున విలపిస్తున్నారు. 


మానసిక స్థితి సరిగా లేక యువకుడు సూసైడ్


హైదరాబాద్‌లోనే మరో ప్రాంతంలో ఓ వైద్య విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సికింద్రాబాద్‌-జగద్దిగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దీక్షిత్ రెడ్డి అనే కుర్రాడు తన పురుషాంగాన్ని కోసుకొని సూసైడ్ చేసుకున్నాడు. 21 ఏళ్ల ఆ కుర్రాడు గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. 


ఆ కుర్రాడి మానసిక పరిస్థితి బాగాలేకనే సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పల్ గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతుల కుమారుడు. చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీక్షిత్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని... చాలా ఏళ్ల నుంచి మందులు వాడుతున్నట్టు పోలీసులు తెలిపారు. 


రెగ్యులర్‌గా వేసుకోవాల్సిన మందులను కొన్ని రోజుల నుంచి వేసుకోవడం లేదని... చివరకు ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఇంట్లోవాళ్లు తిరిగి వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు దీక్షిత్ రెడ్డి. డాక్టర్‌ అయి సేవ చేస్తాడుకుంటే ఇలా అర్థాంతరంగా  ప్రాణాలు తీసుకున్న బిడ్డను చూసి ఫ్యామిలీ గుండెలవిసేలా ఏడుస్తోంది.