పశ్చిమగోదావరి జిల్లా: తల్లిదండ్రులు పిల్లల్ని మందలించాలంటే వాళ్లు ఎలా స్పందిస్తారో, ఏ అఘాయిత్యం చేసుకుంటోనని భయపడాల్సిన రోజులు ఇవి. కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో వారిని ఒక్క మాట అన్నా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో రిజర్వాయర్ లో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో విద్యార్థిని తీసుకున్న ఈ నిర్ణయంతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది.


స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రాచురు గ్రామానికి చెందిన మడకం అఖిలప్రియ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత రాత్రి తండ్రి మందలించడంతో అఖిలప్రియ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బయటకు వెళ్లిన కూతురు ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో అఖి  ఆచూకీ కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని వాకబు చేశారు. అమ్మాయి ఏదో కంగారుగా వెళ్తున్నట్లు కనిపించిందని స్థానికులు చెప్పారు.


కూతురు ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు పోగొండ రిజర్వాయర్ వైపు వెళ్లి, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. ఓవైపు చీకటి, మరోవైపు కూతురు కనిపించకపోవడంతో స్థానిక నాయకులకు సమాచారం ఇచ్చారు. వారు నుంచి వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు కలిసి బుధవారం తెల్లవారుజాము నుంచి  రిజర్వాయర్లో  గాలింపు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్లో బాలిక మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


అఖిలప్రియ చాలా చురుకు.. 
బాలిక చాలా చురుగ్గా ఉంటుందని చదువులో కూడా ఎప్పుడూ ముందుంటుందని అఖిలప్రియ బంధువులు అంటున్నారు. కానీ అలాంటి పిల్ల ఇలా చేస్తుందనుకోలేదన్నారు. స్థానిక నాయకులు విద్యార్థిని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులకు వెళ్లేవారు. తమ కుమారుడు, కూతురు ఉన్నత చదువులు చదవాలని ఆలోచించేవారు. తమ కూతురు ఇలా మృతి చెందడం తమ కుటుంబానికి తీరని లోటని తల్లిదండ్రులు వాపోయారు.

Also Read: Cyber Crime: ఫేస్‌బుక్‌ ఫ్రొఫైల్ పిక్ చూస్తే మూడు లక్షలు పోయాయ్‌, ఇదో రొమాంటిక్‌ సైబర్‌ క్రైమ్ కథా చిత్రం


Also Read: Jagityal: సొంత తమ్ముడ్ని చంపించిన అక్క, లక్షకు సుపారీ - కారణం ఏంటంటే