Warangal News : అందరూ ఒకే తరగతి, వారి మధ్య   గొడవ జరగడంతో మనస్థాపానికి లోనై ఐదుగురు విద్యార్థినిలు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని ఆరెపల్లిలో ఉన్న ఓరుగల్లు రెసిడెన్షియల్ పాఠశాలలో కొత్తగూడ మండల పాకాల బీసీ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్ అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు పరస్పర గొడవపడ్డారు. దీంతో ఆ ఐదుగురు అమ్మాయిలు మనస్థాపాన్ని గురై శానిటేజర్  తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిని గమనించిన తోటి విద్యార్థినులు, అధ్యాపకులు చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినులను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు.


అందరూ క్రమశిక్షణ కలిగిన విద్యార్థినులే-


సుదర్శన్ రెడ్డి బీసీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయంలో చదువుతున్న ఈ విద్యార్థినులు అందరూ కలిసి ఉండేవారు. ఎందుకు గొడవపడ్డారు అర్థం కావడం లేదని అందరూ కూడా ఉత్తమ విద్యార్థులేనని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.


ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకల్లో వివాదం?  


మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకలకు సంబంధించి తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఈ వేడుకలకు హాస్టల్ లోని వారు కాకుండా ఇతర విద్యార్థినులు హాజరు కావడం పట్ల వసతి గృహం అధికారులు ఇక్కడి విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. ఈ క్రమంలో హాస్టల్లోని విద్యార్థినుల మధ్య కూడా గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో ఆవేదనకు గురై ఐదుగురు విద్యార్థినులు హాస్టల్ లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. బాధిత విద్యార్థినులు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అధికారులు మాత్రం ఈ హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకలు ఈ ఘటనకు దారి తీసినట్లు  తెలిసిందన్నారు.


"అందరూ మంచి పిల్లలే. వాళ్లలో వారు గొడవపడి మనస్థాపానికి గురై శానిటైజర్ తగారు. అందరూ బాగా చదువుతారు. స్కూల్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఉపాధ్యాయులు పిల్లల్ని ఏ విషయంలోనూ మందలించలేదు. వారి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ఈ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు విద్యార్థినులు చిన్న బాటిలో ఉన్న శానిటైజర్ తాగారు. వారిని ఆసుపత్రికి తీసుకొచ్చాం. వైద్యులు చికిత్స చేస్తు్న్నారు. అందరూ బాగానే ఉన్నారు. " - ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి 


చెరువులో స్నానానికి దిగి ముగ్గురు విద్యార్థులు మృతి 


హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన ముగ్గురు పిల్లలు శనివారం మధ్యాహ్నం ఈతకని వెళ్లి నానక్ రాంగూడ పటేల్ కుంటలో మునిగిపోయారు. మృతి చెందిన చిన్నారుల వయసు దాదాపు 12 సంవత్సరాలలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు షాభాజ్ (15) దీపక్ (12) పవన్ (13) గా పోలీసులు గుర్తించారు.గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ఓ స్కూల్ లో చదువుకుంటున్న తొమ్మిది మంది విద్యార్థులు నానక్‌రామ్‌గూడ గోల్ఫ్‌ కోర్స్‌ సమీపంలోని చెరువులో ఈతకు దిగారు. వారిలో ముగ్గురు చెరువు లోతు గమనించకుండా దిగడంతో నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన తోటి విద్యార్థులు అటుగా వెళ్లేవారిని సాయం కోరడంతో వారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే విద్యార్థులు మృత్యువాత పడ్డారు.