Warangal Crime : మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు  మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.  వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఏం. ఏ బారి  వివరాలు తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్  ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53), అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరూ కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంభించి, ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకి వచ్చిన సమాచారంతో జితేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ , ఏసీపీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు, వైద్యశాఖ సిబ్బందితో  ఫారహీన ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఫేక్ డాక్టర్ ముసుగులో క్షుద్రపూజలు చేసి తగ్గిస్తామని, సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ ఇతర గ్రామాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47)  అదుపులోకి తీసుకొని విచారించారు. 



పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు  


పౌర్ణమి,  అమావాస్య రోజున క్షుద్రపూజాలు చేస్తూ తన దగ్గరికి వచ్చిన వారికి రోగాలను నయం చేస్తున్నట్లు నమ్మించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.  సయ్యద్ ఖాదిర్ అహ్మద్ గతంలో కరీంనగర్ లోని ఒక డాక్టర్ వద్ద సహాయకునిగా కొంత కాలం పనిచేసి అక్కడ వైద్యం ఏ విధంగా చేయాలో నేర్చుకొన్నారు. తన తండ్రి ఖరిముళ్ల ఖాద్రి గతంలో పూజలు చేసి  తాయత్తులు కట్టేవాడు. ఈ అనుభావంతో అతను హనమకొండలోని నయీంనగర్ లోని కెయుసి క్రాస్ రోడ్డు వద్ద 35 ఏళ్ల నుంచి ఫారహీన  క్లినిక్ పేరిట నిబంధనలకు విరుద్దంగా, ఎలాంటి పత్రాలు లేకుండా ఒక ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. తన వద్దకు వచ్చిన రోగులకు వారిపై గిట్టని వారు చేతబడులు చేశారని, దయ్యం పట్టిందని, నర దృష్టి ఉంది  అని, మీలో దోషాలు ఉండడం వల్ల సంతానం కలుగడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని లేని పోనీ భయలు కలిగించి క్షుద్రపూజాలు చేసి వాటిని పరిష్కరిస్తానని ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు.  




గతంలో క్రిమినల్ కేసు 


కొంతమందికి దీర్ఘకాలంగా ట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులు దోచుకుంటున్నాడు సయ్యద్ ఖాదిర్ అహ్మద్. రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటానికి ఆలోపతి మందులు మంత్రించి ఇస్తున్నట్లు ఇచ్చి అవి వాడిన తరువాత రోగం నయం అయితే క్షుద్రపూజాలు  వలనే తగ్గిందని నమ్మిస్తున్నారు.  ఇతను హన్మకొండ లోనే కాకుండా హైదరాబాద్ లో కొంత మంది రోగుల స్థితిని బట్టి స్వస్థలాకు వెళ్లి క్షుద్రపూజాలు చేశాడు. ఇతనికి సహాయకులుగా ఉన్న  సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (46)ను  హైదరాబాద్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా, అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ పరారీలో ఉన్నారని తెలిపారు. సయ్యద్ ఖదీర్ అహ్మద్ పై గతంలో గుప్త నిధుల తవ్వకంపై ములుగు ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు అయింది. నిందితుల నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు. నిందితుల నుంచి ఆలోపతి మందులు,  క్షుద్రపూజ సామాగ్రి, ల్యాబ్ టెస్ట్ సామాగ్రి, ఒక ఫోన్, తవేరా  వాహనం, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.