ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం వల్ల ఆ పార్టీకి ఒక్క ఓటు పెరుగుతుందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు సైతం ఆయనను చూసి బీజేపీకి ఓట్లు వెయ్యరని విమర్శించారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 


ఆలయం వెలుపలకు వచ్చిన అనంతరం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన ఆది జాంబవంతుని గుడి నిర్మాణం చేయాలనీ టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. శ్రీ రామనవమి ఉత్సవాల లోపు జాంబవంతుని ఆలయంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. త్వరలో బీజేపీలో చేరుతున్నారు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. కిరణ్ బీజేపీలోకి వెళ్లడం వల్ల ఒక్క ఓటు మాత్రమే ఆ పార్టీకి పెరుగుతుందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా బీజేపీకి ఓట్లు వెయ్యరని ఎద్దేవా చేశారు. 


నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నేతలు చేసే ఆరోపణలు చేతగానివాడు చేసే ప్రయత్నమన్నారు. ప్రతిపక్షాలు ఓటమి స్వీకరించలేక చేసే ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఎవరిపై ఎప్పుడు చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలుసునన్నారు. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఈవీఎం మిషన్స్ మార్చారని ఆరోపణలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామా స్వరాజ్యం తెచ్చారన్నారు. రైతు భరోసా కేంద్రాలు..అనేక సంక్షేమ పధకాలు తీసుకొచ్చి మన గ్రామంలోనే సమస్యలను పరిష్కరించుకొనే విధానాన్ని సీఎం తీసుకొచ్చారని కొనియాడారు.  


కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా 
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. శనివారం రోజే కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.  బీజేపీలో చేరికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఫైనల్‌గా అమిత్‌షాతో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. 


బీజేపీలో చేరనున్నారా ! 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీలోకి చేరోబుతున్నట్టు సమాచారం. 2014 నుంచి ఆయన రాజకీయ అజ్ఞాతంలో ఉన్నారు. ఎలాంటి రాజకీయా కామెంట్స్ కానీ, రాజకీయాలపై అభిప్రాయాలు కాని చెప్పడం లేదు. ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పని చేసిన ఆయన విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్నారు. తర్వాత జరిగిన కీలక పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.