Mother Murdered Son: పిల్లలు కడుపులో పడినప్పటి నుంచి ఆ తల్లి.. పిల్లల కోసం ఎన్నో కలలు కంటుంది. వారికోసం ఎన్నెన్నో త్యాగాలను కూడా చేస్తుంది. వారిని మంచి స్థానంలో చూడాలని.. రేయింబవళ్లు కష్టపడుతుంటుంది. అయితే భర్త చనిపోయిన ఓ తల్లి కూడా తన కూతురు, కొడుకు కష్టపడి సాకుతోంది. బాగా చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం తెచ్చుకొని తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఆ కన్నకొడుకు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఓనాడు ఫుల్లుగా తాగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితం అయ్యాడు. ఇంతటి కష్ట సమయంలో కూడా అతనికి కాస్త కూడా బుద్ధి రాలేదు. తాగేందుకు మద్యం, తినేందుకు మాంసాహారం కావాలంటూ తల్లిని వేధిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ తాళలేని ఆ తల్లి.. కన్నకొడుకును చంపేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా అతను తినే అన్నంలో పురుగుల మందు కలిపేసింది. సొంత కుమారుడిని కాటికి పంపింది. 


విజయనగరం జిల్లా డెండాక మండలానికి చెందిన గొడ్డు రామాయమ్మ భర్త మూడేళ్ల కిందట చనిపోయారు. కుమార్తె సునీత, కుమారుడు సాయితో కలిసి పూసపాటిరేగ మండలం గుండపు రెడ్డిపాలెంలో ఉంటున్నాడు. స్థానికంగా ఫార్మా కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే మూడు నెలల క్రితం కుమారుడు ఫుల్లుగా తాగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే కాళ్లు విరిగిపోయి మంచానికి పరిమితం అయ్యారు. అంతకు ముందే చెడు వ్యసనాలకు బానిసై అయిన అతడు ఇంట్లోనూ మద్యం తాగేవాడు. రోజూ మాంసం వండాలని, మద్యం తీసుకురావాలని తల్లిని, అక్కని వేధించి కొట్టేవాడు. కుమారుడి ఆగడాలను భరించలేని రామాయమ్మ శుక్రవారం రాత్రి సాయి(20)కి అన్నంలో పురుగుల మందు కలిపి వడ్డించారు. 


అది తిన్న  సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ తర్వాత తల్లే స్వయంగా అంబులెన్స్ కు సమాచారం అందించింది. హుటాహుటిన రంగంలోకి దిగి సాయి శనివారం చనిపోయాడు. ఈ మృతిపై సోదరి సునీత అనుమానాలు వ్యక్తం చేయగా... తల్లిని విచారించారు. అయితే వేధింపులు తాళలేక, అతడి అడిగింది ఇవ్వలేకే అన్నంలో పురుగుల మందు కలిపినట్లు ఆమె ఆంగీకరించారు. 


సొంత తమ్ముడినే హత్య చేసిన అన్న..


తమ్ముడి వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూడటంతో సొంత తమ్ముడ్ని హత్య చేశాడు అన్న. ఈ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకుంది సొంత అన్న భార్యతోనే కావడం ఇక్కడ విశేషం. తాను ఇంటికి వచ్చే సరికి తన భార్య తమ్ముడితో కలసి ఉండటం చూసిన భర్త కోపోద్రిక్తుడై వెంటనే తమ్ముడిపై దాడి చేశాడు. కర్రతో తలపై కొట్టాడు. ఆ దెబ్బలకి తమ్ముడు అక్కడే రక్తపు మడుగులో పడిపోయి చనిపోయాడు. చిల్లకూరు మండలం కాకువారిపాలెంలో ఈ ఘటన జరిగింది. 


అసలేం జరిగింది?


కాకువారి పాలెం గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దెపల్లి బాలాజీ, ప్రతాప్‌ అన్నదమ్ములు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. వేరు కాపురాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ్ముడు ప్రతాప్ భార్య కాన్పు సమయంలో చనిపోయింది. అప్పటినుంచి ప్రతాప్ కూడా తన అన్న కుటుంబంతోనే కలసి నివశిస్తున్నాడు. బాలాజీ, తన భార్య కలసి ఉంటుండగా ఆ కుటుంబంలోకి ప్రతాప్ వచ్చి చేరాడు. కానీ ప్రతాప్ తన బుద్ధి చూపించాడు. అన్న బాలాజీ పనికి వెళ్లిన సమయంలో తమ్ముడు బాలాజీ వదినతో చనువు పెంచుకున్నాడు. ఈ చనువు పెరిగి పెద్దదై అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో బాలాజీ బయటకు వెళ్లిన తర్వాత వదిన మరిది చనువుగా ఉండేవారు. ఈ విషయం బాలాజీకి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. 


పరారీలో అన్న..


చివరకు పాపం బయటపడింది. రాత్రి ప్రతాప్, అతని వదిన సన్నిహితంగా ఉండగా సడన్ గా ఇంచికొచ్చిన బాలాజీ షాకయ్యాడు. కోపంతో తమ్ముడిపై దాడి చేశాడు. ప్రతాప్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత బాలాజీ అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ వివరాలను సేకరించారు. ప్రతాప్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడని, అతడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు సీఐ శ్రీనివాసులరెడ్డి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.