మగతోడు లేడని అలుసుగా తీసుకొని ఓ కుటుంబాన్ని వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘటన విజయనగరంలో వెలుగు చూసింది. భర్త చనిపోయిన ఓ మహిళను అతను ప్రేమించి పెళ్లాడి.. తర్వాత ఆమె కుమార్తెపై కూడా కన్నేశాడు. ఏకంగా 17 ఏళ్ల కూతుర్ని నమ్మించి మరో చోటకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటున్నానంటూ తల్లికే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోలేని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. చివరికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కుమార్తెపై కూడా కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి బాలిక తల్లికి (భార్యకు) ఫోన్‌ చేసి బాలికను పెళ్లాడతానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు. చేసేది లేక ఆ తల్లి విజయనగరం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు శనివారం నాడు మీడియాకు తెలిపారు. విజయనగరం నగరంలో నక్కాన లక్ష్మి అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమెకు 14ఏళ్ల క్రితమే ఆమె భర్త జబ్బు చేసి చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకుంటూ తన కుమార్తెను చదివించుకుంటోంది. ప్రస్తుతం కూతురికి 17 ఏళ్లు. స్థానికంగానే ఓ కేటరింగ్‌లో కంపెనీలో పని చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటోంది. 


ఆ సమయంలోనే సురేష్‌ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. అది క్రమంగా వారిద్దరి మధ్యా ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇంట్లో ఉన్న కుమార్తెపైన కూడా సురేష్ మోజుపడ్డాడు. అనంతరం ఆమెను మభ్య పెట్టి తిరుపతికి తీసుకెళ్లాడు. సురేష్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి బేరం తిరుపతికి రావడంతో అక్కడికి వెళ్తున్నానని భార్యతో చెప్పాడు. ఒక టికెట్‌ ఖాళీగా ఉందని లక్ష్మికి చెప్పి నమ్మించాడు. కుమార్తె కూడా తనతో పాటు తిరుపతికి వస్తే బావుంటుందని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లిన రెండు రోజుల తర్వాత భార్య లక్ష్మికి ఫోన్‌ చేసి.. బాలిక, తాను పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి కట్ చేశాడు. వెంటనే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. మళ్లీ ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు డ్రైవర్ సురేష్‌పై కిడ్నాప్‌ కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. అయితే, అతను బాలికను ఇంకా పెళ్లి చేసుకున్నాడా లేదా అనే అంశం తెలియాల్సి ఉంది.