Visakha Train Accident: విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో నిన్న జరిగిన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే రైలు దిగే క్రమంలో ప్రమాద వశాత్తు జారిపడి ప్లాట్ ఫాంకు రైలుకు మధ్య ఇరుక్కొని గంటలపాటు నరకం చూసిన విద్యార్థిని శశికళ ఈరోజు మృతి చెందింది. చికిత్స పొందతూ ఈరోజు ప్రాణాలు కోల్పోయింది. అయితే చదువుకునేందుకు కళాశాలకు వెళ్లిన అమ్మాయి ఇలా ప్రమాదానికి గురై చనిపోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అచేతనంగా పడి ఉన్న కూతురును చూస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు.




అసలేం జరిగిందంటే..?


విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది. రైలు దిగబోతుండగా ఓ యువతి ప్రమాదవశాత్తు జారి పడింది. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అమ్మాయిని అందులోంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో కూలీలను రప్పించి ప్లాట్ ఫాంను పగులగొట్టారు. ఇలా అమ్మాయిని బయటకు తీశారు. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన యువతి పేరు శశికళ. ఆమె కళాశాలకు వచ్చేందుకు గోపాలపట్నం నుంచి దువ్వాడకు వస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరగడం.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందడం బాధాకరం.




ఏడు నెలల క్రితం శ్రీకాకుళం రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి


శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగడంతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ట్రాక్ పై దిగారు. కొందరు ప్రయాణికులు పట్టాలు దాటుతున్న సమయంలో విశాఖ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జి.సిగడాం-చీపురుపల్లి మధ్య జరిగిన రైలు ప్రమాదంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తక్షణమే స్పందించారు. ఆర్.డి.ఓ, తహశీల్దార్ ను ప్రమాద స్థలానికి హుటాహుటిన వెళ్లాలని ఆదేశించారు. అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందిని కూడా కలెక్టర్ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ ను ప్రమాద స్థలానికి పంపినట్లు తెలిస్తోంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


అసలేం జరిగిందంటే..? 


స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు నుంచి సిల్చెర్ వెళ్తున్న గువాహటి ఎక్స్‌ప్రెస్ చీపురు పల్లి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చైన్ లాగి రైలు ఆపేశారు. కొందరు కిందకు దిగి పట్టాలపై నిల్చున్నారు.  ఇదే సమయంలో భువనేశ్వర్ నుంచి విశాఖ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకొచ్చి పట్టాలపై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.