Visakha Crime News: తల్లిదండ్రులు చనిపోవడంతో బంధువుల పెరిగిందా బాలిక. ఐదో తరగతి పూర్తవగానే ఆమెను ఓ ఆశ్రమంలో చేర్పించేశారు. అయితే అక్కడే ఉంటున్న బాలికకు స్వామీజి ఆవులకు మేత వేయడం, పేడ తీయడం వంటి పనులు చెప్పేవాడు. ఈక్రమంలోనే అర్ధరాత్రి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. గొలుసులతో కాళ్లను బంధించి మరీ అరాచకం సృష్టించేవాడు. గత రెండేళ్లుగా రోజూ ఇదే తంతు. ఎట్టకేలకు ఎలాగోలా బాలిక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వామీజిని అరెస్ట్ చేశారు. 


రాజమహేంద్రవరానికి చెందిన 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోయారు. దీంతో బంధువులు ఐదో తరగతి వరకు చదివించి రెండేళ్ల క్రితం విశాఖలోని కొత్త వెంకోజీపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఆ ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటి పనులను చేయించేవారు. అర్ధరాత్రి అయ్యాక తనతో పాటు గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు. ఏడాది నుంచి బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించి ఎదురు తిరిగితే కొట్టేవారు. కేవలం రెండు రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవారు. రెండు వారాలకు ఒకసారి మాత్రమే స్నానానికి వెళ్లాల్సి వచ్చేది. కాలకృత్యాలకు అనుమతించేవాడు కాదు. బకెట్ లోనే కానివ్వాల్సి పరిస్థితి. ఇలా గత రెండేళ్లుగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. 


తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కి విజయవాడ చేరుకున్న బాలిక


అయితే ఈ విషయాన్ని గుర్తించిన పని మనిషి బాలికకు సాయం చేసి ఈ నరకం నుంచి బయట పడేసింది. ఈనెల 13వ తేదీన తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కగా.. తనకు పరిచయమైన ఓ ప్రయాణికురాలికి తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా కంకిపాడులోని హాస్టల్ లో చేర్చేందుకు ప్రయత్నించగా.. పోలీస్ స్టేషన్ నుంచి లేఖ తీసుకొస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో వారు కంకిపాడు పీఎస్ కు వెళ్లారు. పోలీసులు ఇచ్చిన లేఖను తీసుకొని బాలల సంక్షేమ కమిటీకి బాలికను తీసుకెళ్లగా.. ఆశ్రమంలో అనుభవించిన నరకాన్ని వారికి బాలిక తెలిపింది. దీంతో సీడబ్ల్యూసీ సభ్యులను బాలికను విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్ కు పంపించగా పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విశాఖ పోలీసులు స్వామీజీని అరెస్ట్ చేశారు.


Also Read: లైంగికదాడికి యత్నించిన సవతి తండ్రిపై కూతురు దాడి, చికిత్సపొందుతూ వ్యక్తి మృతి


ఆశ్రమ భూములు కొట్టేసేందుకే నాపై ఆరోపణలు..


ఆశ్రమ భూములు కొట్టేయాలని కొందరు చూస్తున్నారని, ఇందులో భాగంగానే కుట్ర జరిగిందని స్వామీజి చెబుతున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. తమ ఆశ్రమంలో ఉండే ఓ బాలిక అదృశ్యమైందని ఆశ్రమ నిర్వాహకులు ఈనెల 15వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ తతంగం అంతా జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial