Case Filed On Kodali Nani And Collector: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి (Kodali Nani) మరోసారి షాక్ తగిలింది. 'తన తల్లి చావుకు వారే కారణం' గుడివాడ (Gudivada) ఆటోనగర్‌కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ (Duggirala Prabhakar) అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నానితో పాటు కృష్ణా జిల్లా గత జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డి, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 448, 427, 506 ఆర్అండ్‌డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నానిపై ఒకట్రెండు కేసులు నమోదయ్యాయి.


ఇదీ కారణం


'గుడివాడ ఆటోనగర్ నాలుగో రోడ్డులోని పాత లిక్కర్ గోడౌన్‌కు 2011లో మా అమ్మ ఓనర్‌గా ఉండేవారు. ఆ సమయంలో టెండర్ల ద్వారా తక్కువ ధరకే లిక్కర్ గోడౌన్ పొందాం. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. పద్మారెడ్డి అనే వ్యక్తి ఆయన అల్లుడు రామ్‌గోపాల్‌రెడ్డి, అప్పటి జేసీ మాధవీ లతారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి సహకారంతో మా గోడౌన్‌ను బలవంతంగా ఖాళీ చేయించారు. పద్మారెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని ప్రమేయంతో మమ్మల్ని బెదిరించారు. తమ గోదాంలోని లిక్కర్ కేసులను పగలగొట్టి తగలబెట్టారు. మా బాధ చెప్తే వాసుదేవరెడ్డి, మాధవీ లతారెడ్డి దూషించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నా తల్లి మనస్తాపంతో కన్నుమూశారు. కొడాలి నాని, ఆయన అనుచరులు, అప్పటి అధికారులు అందరిపైనా గుడివాడ - 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అయితే, నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.' అని ఫిర్యాదుదారు ప్రభాకర్ మీడియాకు తెలిపారు.


Also Read: Annamayya District: వంట చేయడానికి వచ్చి దుప్పటి సాయంతో ఖైదీ జంప్- రాజంపేట సబ్ జైలులో ఘటన