Vijayawada Bikes Torched : విజయవాడలో బైక్ ల ద‌గ్దం ఘ‌ట‌న క‌ల‌కం రేపుతోంది. రాజ‌కీయంగా కూడా ఈ వ్యవహ‌రం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసింది. జ‌న‌సేన నేత‌లు ఆరోపణలతో పోలీసుల‌తో పాటు, వైసీపీ స్థానిక ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ ఈ ఘ‌ట‌నపై విచార‌ణ చేప‌ట్టారు. సంఘ‌ట‌నా స్థలాన్ని మేయ‌ర్ ను వెంట పెట్టుకొని ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీ‌నివాస్, పోలీసు అధికారులు ప‌రిశీలించారు. బైక్ దగ్ధం అవ్వడానికి గల కార‌ణాల‌ను వాక‌బు చేశారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు, త‌మ వాహ‌నాల‌ను కొండ దిగువ‌నే పార్కింగ్ చేసుకుంటారు. రాత్రి పార్కింగ్ చేసిన వాహ‌నాల‌ను గుర్తు తెలియ‌ని వ్యక్తులు కాల్చేశారు. అయితే గంజాయి బ్యాచ్ కు చెందిన వ్యక్తులు ఈవాహ‌నాల‌ను దగ్ధం చేశార‌ని, స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 


పోలీసుల కథనం ఇలా 


ఈ వ్యవ‌హ‌రం తీవ్ర స్థాయిలో విమ‌ర్శల‌కు తావిచ్చింది. రాజకీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు కూడా ఈ వ్యవ‌హ‌రంపై ఆరోపణలు చేయ‌టంతో పోలీసులపై కూడా ఒత్తిడి పెరిగింది. అయితే చివ‌ర‌కు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటే గ్యాస్ డెలివ‌రీ బాయ్, సాయి బైక్ ల‌ను ద‌గ్దం చేసిన‌ట్లుగా పోలీసుల‌ గుర్తించారు. సాయికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవ‌ల సాయిని భార్య విడిచిపెట్టి త‌న కూతురుతో వెళ్లిపోయింది. సాయికి స్థానికంగా నివాసం ఉండే మ‌రో వ్యక్తికి విభేదాలు ఉన్నాయి. ఆ నేపద్యంలో రాత్రి స‌మయంలో సాయి అత‌ని బైక్ కు నిప్పుపెట్టాడు. అది కాస్త మిగిలిన మ‌రో నాలుగు బైక్ ల‌కు అంటుకుంది. దీంతో ఈ వ్యవ‌హ‌రం హాట్ టాపిక్ గా మారింది. ఇది పోలీసుల కథనం. అయితే బైక్ ల దగ్ధం వెనుక మాత్రం గంజాయి బ్యాచ్ పాత్ర ఉంద‌నే అనుమానాలు మాత్రం స్థానికుల నుంచి బ‌లంగా విన‌ప‌డుతోంది. గంజాయి బ్యాచ్ ఆగ‌డాలపై రాజ‌కీయంగా ఈ వ్యవ‌హ‌రం ప్రభుత్వానికి ఇబ్బందిగా మార‌టంతో కావాల‌నే పోలీసులు ఇలా కేసును డైవ‌ర్ట్ చేశార‌నే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 


అసలేం జరిగింది? 


విజయవాడ కొత్తపేట లంబాడీపేటలో ఐదు బైక్ మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. గంజాయి మత్తులో ఓ బ్యాచ్ బుధవారం రాత్రి ఐదు బైక్ లను దగ్దం చేసిందని స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపించాయి. శివారు ప్రాంతం కావడంతో  గంజాయి మత్తులో  కొందరు యువకులు ఇలా చేశారన్నారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను దగ్దం చేస్తున్నారన్నారు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.