Birthday Party Ganjai : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల గంజాయి వ్యవహారం కలకలం రేపింది. బర్త్ డే పార్టీ జరుగుతుండగా పోలీసులు మెరుపు దాడులు చేశారు. కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.అయితే అసలు వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటన తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ శివారు ప్రాంతంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలలో గంజాయి ఎలా వచ్చింది. ఎవరైనా కావాలనే తీసుకువచ్చి పెట్టారా, లేదా బర్త్ డే ఉందని ఎంజాయ్ చేద్దామని తీసుకువచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే కోణంలో పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అయితే ఇందులో పెద్దల పిల్లలు వ్యవహారం వెలుగు చూసింది. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ నాయకుల అనుచరులుతో పాటుగా, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మరో నాయకుడి కుమారుడు ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అయితే పోలీసులు ఈ విషయాలపై గోప్యత పాటిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లుగా చెబుతున్నారు.  


బర్త్ డే పార్టీలోకి గంజాయి ఎలా వచ్చింది


ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం శాంతి నగర్ లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి 12 మంది యువకులు, మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. అయితే యువతులకు, వేడుకలతో సంబంధం లేదని తమ దర్యాప్తులో తేలిందని, దీంతో వారిని విడిచిపెట్టామని ఏసీపీ వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలోని శాంతినగర్ సందీప్ అనే యువకుడి పుట్టినరోజు వేడుకలపై పోలీసులు దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో కిలో గంజాయిని స్వాధీనం చేసుకుని వేడుకల్లో ఉన్న 12 మంది యువకులు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన కిషోర్ అనే యువకుడు పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. మిగిలిన వారిని అరెస్టు చేశామని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ముగ్గురు యువతులు పుట్టినరోజు వేడుకల్లో వంట చేసేందుకు వచ్చినట్లు తమ దర్యాప్తులో తేలడంతో వారిని విడిచిపెట్టినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. పరారైన కిశోర్ దొరికితే గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా జరిగే పుట్టినరోజు వేడుకల్లో సైతం గంజాయి పట్టుబడటం స్థానికంగా కలకలం రేపుతోంది.


గంజాయి రవాణాపై  నిఘా 


గంజాయి రవాణా, వినియోగంపై ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు నిఘాను పెట్టారు. అనుమానం వచ్చిన ప్రాంతాల్లో తనిఖీలు చేయటం, చెక్ పోస్ట్ ల ద్వారా అంతర్రాష్ట  రవాణాను కట్టడి చేయటం, జిల్లాల సరహద్దుల్లో గస్తీని ముమ్మరం చేయటం ద్వారా  మత్తు పదార్థాలను వినియోగించటాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాదు ఇప్పటికే పోలీసులు సెబ్ స్కీమ్ లు, గంజాయి. మత్తు పదార్థాలపై  విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా ప్రైవేట్ పార్టీల్లో, బర్త్ డే వేడుకల్లో గంజాయి పట్టుబడుతుండటం సంచలనంగా మారుతోంది. ఇలాంటి కేసులను గుర్తించిన పోలీసులు వాటిని ఛేదించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.