Adani Enterprises: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తర్వాత భారీ అమ్మకాల తుపానులో చిక్కుకున్న అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ మీద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది, గ్రూప్‌లోని 3 కంపెనీలను అదనపు నిఘా (additional surveillance measure -ASM) కిందకు తీసుకువచ్చింది. అమ్మకాల తుపాను తీరం దాటడంతో, ఆ 3 స్టాక్స్‌ ఒక్కొక్కటిగా ASM ఫ్రేమ్‌వర్క్‌ నుంచి బయట పడ్డాయి.


2023 ఫిబ్రవరి 3న, అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), అంబుజా సిమెంట్స్ ‍‌(Ambuja Cements), అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను (Adani Ports and Special Economic Zone) నిఘా ఫ్రేమ్‌వర్క్‌లో NSE ఉంచింది. అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ గత నెలలో ఫ్రేమ్‌వర్క్ నుంచి విడుదల అయ్యాయి. 
 
బుధవారం నుంచి ఆంక్షలు లేని ట్రేడింగ్‌
అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను, దాదాపు నెల రోజుల తర్వాత, స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ నుంచి ఎన్‌ఎస్‌ఈ మినహాయిస్తోంది. ఈ కౌంటర్‌ను బుధవారం (08 మార్చి 2023) నుంచి ASM ఫ్రేమ్‌వర్క్‌ నుంచి బయటకు వస్తుంది. 


స్టాక్స్‌లో అధిక అస్థిరత ఉన్న సందర్భాల్లో, ఎక్స్ఛేంజీలు షార్ట్ సెల్లింగ్ లేదా స్పెక్యులేటివ్ ట్రేడ్‌ల నుంచి పెట్టుబడిదారులను రక్షించడానికి స్టాక్‌లను స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్‌ కిందకు తరలిస్తాయి.


రెండు వైపులా పదునున్న కత్తి 
ASM ఫ్రేమ్‌వర్క్‌ నుంచి బయటకు రావడం అంటే, స్టాక్‌ ఎక్సేంజీ రక్షణ కవచం నుంచి బయటకు వచ్చినట్లే. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒక విధంగా ఉపయోగం, మరొక విధంగా నష్టం ఉంటుంది. 


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్‌లో బుధవారం నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ట్రేడింగ్‌ చేసుకోవచ్చు, ఆ రోజు నుంచి ట్రేడర్లు 100% మార్జిన్‌ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఈ స్టాక్‌లో లావాదేవీలు పెరుగుతాయి, అదే సమయంలో  తీవ్ర అస్థిరతను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది.


అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా, 2023 జనవరి 24న USకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) విడుదల చేసిన వివాదాస్పద నివేదిక అదానీ స్టాక్స్‌లో భారీ రక్తపాతాన్ని సృష్టించింది. అదానీ గ్రూప్ పెట్టుబడిదార్లు సహా మొత్తం స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లను ఒక నెలకు పైగా బాధ పెట్టింది. ఈ నెల రోజుల్లో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ స్టాక్స్‌ ఉమ్మడి మార్కెట్ విలువ 50% పైగా తగ్గింది.


లైఫ్‌ లైన్‌ అందించిన GQG పార్ట్‌నర్స్
ఒక నెలకు పైగా సాగిన కఠిన అమ్మకాల తర్వాత... అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గత వారం కొంత ఉపశమనం లభించింది. గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ GQG పార్ట్‌నర్స్ అదానీ గ్రూప్ స్టాక్స్‌పై రూ. 15,000 కోట్ల పందెం కాసింది. ఇది అదానీ గ్రూప్‌ పిక్చర్‌ను పూర్తి మార్చేసింది, గౌతమ్‌ అదానీకి లైఫ్‌ లైన్ అందించింది.


GQG పార్టనర్స్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 3.4%, అదానీ పోర్ట్స్‌లో 4.1%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5%, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3.5% వాటాలను కొనుగోలు చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.