యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 20 ఏళ్ల యువతి మైనర్లైన తన ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా హతమార్చింది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో వారు చూసేశారని ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 


ఏం జరిగిందంటే.?


యూపీ బల్ రాయ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఓ కుటుంబంలో అంజలి (20), సురభి (7), రోష్ని (4) ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అంజలికి ఓ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఆదివారం కుటుంబంలోని పెద్దలు బయటకు వెళ్లిన క్రమంలో అంజలి ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో మిగిలిన ఇద్దరు చెల్లెళ్లు వారిని చూశారు. దీంతో ఆందోళనకు గురైన అంజలి, తమ విషయం ఇంట్లో చెప్తారేమోనని భయపడింది. దీంతో వారిని చంపాలని నిర్ణయించుకుని ఓ పదునైన ఆయుధంతో ఇద్దరు చెల్లెళ్లపై కనికరం లేకుండా దాడి చేసింది. ఈ క్రమంలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ ఆయుధాన్ని బయట పడేసింది. దుస్తులకు అంటుకున్న రక్తాన్ని కడిగి, ఆధారాలు మాయం చేసేందుకు యత్నించింది.


అనుమానంతో పోలీసుల విచారణ


కొంత సేపటి తర్వాత ఇంట్లో ఇద్దరు చెల్లెళ్లు చనిపోయారన్న వార్త స్థానికులకు తెలిసింది. ఏదో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయుంటారని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి ఎవరో కావాలనే చంపేశారనే నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను అనుమానించారు. అందరినీ విచారించగా అంజలియే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.


నిందితురాలి అరెస్ట్


తన ప్రియుడితో సన్నిహితంగా ఉండగా తన చెల్లెళ్లు చూశారని, వారు ఇంట్లో చెబుతారనే భయంతో వారిని చంపేసినట్లు అంజలి పోలీసుల విచారణలో వెల్లడించింది. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఐజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.


ప్రియుడి పాత్రపై నో క్లారిటీ


మైనర్ల హత్యలో అంజలి ప్రియుడి పాత్ర ఉందా..? లేదా అనే విషయంపై క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ తర్వాతే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.