UP Man Killed in US: అమెరికాలో మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సిక్కుని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని కీర్తన్ గ్రూప్‌లో పని చేస్తున్న మ్యుజీషియన్ రాజ్ సింగ్ అలియాస్ గోల్డీపై అలబామాలోని గురుద్వారా వద్ద కాల్పులు జరిపారు. ఫిబ్రవరి 23న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నరగా అమెరికాలోనే ఉంటున్న రాజ్‌సింగ్ గురుద్వారాలో కీర్తనలు పాడేందుకు వెళ్లాడు. ఈ కార్యక్రమం ముగిసిన తరవాత గురుద్వారా నుంచి బయటకు వచ్చాడు. రోడ్డుపై నిలబడి ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు వచ్చి కాల్పులు జరిపారు. కుటుంబాన్ని పోషిస్తున్న రాజ్‌సింగ్ మృతిపై బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోయాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రాజ్‌సింగ్ కూడా చనిపోవడం కుటుంబ సభ్యుల్ని కలిచి వేసింది. వీలైనంత త్వరగా అతని మృతదేహాన్ని భారత్‌కి రప్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. 


 ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండియన్ జర్నలిస్ట్ మృతి చెందాడు. హర్లేమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుడు కారణంగా మంటలు విపరీతంగా వ్యాపించాయి. అప్పటికే కొంత మంది కిటికీలో నుంచి దూకారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే...27 ఏళ్ల ఫాజిల్ ఖాన్ మాత్రం ఆ మంటల్లో చిక్కుకుని చనిపోయాడు. ఈ మేరకు ఇండియన్ ఎంబసీకి సమాచారం అందింది.