Tirupati News : ప్రేమ వివాహం ఆ యువతికి శాపంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకుని అమ్మగారింటికి వచ్చిన ఆ యువతి పట్ల ఆ ఊరి గ్రామస్తులు కర్కశంగా ప్రవర్తించారు. గ్రామ కట్టుబాటు ప్రకారం గ్రామస్తులు విధించిన జరిమానాను ఇచ్చిన గడువులోపు చెల్లించాలని లేదంటే ఆ గ్రామం నుంచి ఆ కుటుంబాన్ని బహిష్కరిస్తామని గ్రామ పెద్దలు చెప్పారు. ప్రేమ వివాహం‌ చేసుకుని ఎనిమిది నెలల‌ తరువాత అమ్మగారింటికి వచ్చిన యువతికి యాభై వేల రూపాయలు జరిమానా విధించారు గ్రామస్తులు. కొంత సమయం అడిగినందుకు మహిళ అనే గౌరవం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ దారుణ ఘటన తిరుపతి‌ జిల్లా ఏర్పేడు మండలంలో చోటుచేసుకుంది. 


అసలేం జరిగింది? 


తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాత వీరాపురం గ్రామానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ ఊరి పెద్దలు జరిమానా విధించారు. పాత వీరాపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన లీలావతి అనే యువతి 8 నెలల క్రితం కడప జిల్లాకు చెందిన శ్రీహరి అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియుడిని వివాహం చేసుకున్న రోజు నుంచి అత్తవారింటిలోనే ఉన్న లీలావతి, వివాహం తర్వాత మొదటి సారి పుట్టింటికి వాళ్ల పిలుపుతో వీరాపురం గ్రామానికి తిరిగి వచ్చింది. ఈ‌ నెల 14వ తేదీన స్వగ్రామానికి వచ్చిన లీలావతిని గంటల వ్యవధిలోనే ఆ గ్రామపెద్దలు నిలదీశారు. గ్రామ కట్టుబాటు ప్రకారం ప్రేమ వివాహం, కులంతర వివాహం చేసుకున్నవారికి జరిమానా విధించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందని లీలావతి భర్త శ్రీహరిని గ్రామ కట్టుబాట్లు తెలియజేశారు. 


జరిమానా చెల్లించలేదని దాడి 


తమ గ్రామం కట్టుబాటును అతిక్రమించి ప్రేమ వివాహం చేసుకున్న లీలావతికి 50 వేల రూపాయలు జరిమానా విధించారు గ్రామ పెద్దలు. కొంత సమయం కావాలని లీలావతి కుటుంబ సభ్యులు గ్రామస్తులను వేడుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు గడువు ఇచ్చారు. అయితే నగదు సమయానికి దొరక్కపోవడంతో మరికొద్ది రోజులు గడువు అడిగారు. దీంతో లీలావతిపై గ్రామస్తులు విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో‌ పడి ఉన్న లీలావతిని కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు లీలావతి ఫిర్యాదుతో గ్రామానికి చెందిన మురగయ్య, వాణి, సునీల్, అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. లీలావతిని గ్రామస్తులు తీవ్రంగా గాయపరచడంతో గర్భస్రవం అయ్యిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


దాడిపై కేసు నమోదు 


"పాత వీరాపురం గ్రామంలో లీలావతి యువతి ఎనిమిది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ఎస్సీ కమ్యూనిటీకి చెందినంది. ఆ గ్రామ కట్టుబాట్లు ప్రకారం ఎవరైనా కులాంతర, ప్రేమ వివాహం చేసుకుంటే ఎస్సీ కాలనీ అభివృద్ధి కోసం రూ.25 వేలు కట్టాలి. లేదంటే ఎస్సీ కాలనీలో గుడి బాగుచేయాలి. లేదంటే గ్రామంలోని ఎస్సీలందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. ఇలా కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చింది. ఈ విషయంపై గ్రామ పెద్దలు ప్రశ్నించారు. కొందరు యువతిపై దాడికి పాల్పడ్డారు. ఆమెను రూయా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదుచేశాం"- పోలీసులు