Tirupati Crime News: మహిళలపై రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. పసికందు నుంచి పండు ముసలి వాళ్ల వరకూ కామాంధులు తమ కోరికను తీర్చుకునేందుకు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. మహిళలపై, ‌మైనర్ బాలికలపై అఘాయిత్యాలు నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు అమలు చేస్తున్నా.. కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు. ఏదో ఒక మూల ఏదోక సందర్భంలో మానవ రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు.. మహిళలపై అఘాయిత్యాలకు  పాల్పడుతున్నారు. తాజాగా నాగలాపురం పోలీస్ స్టేషన్ లో ఓ బాలిక తల్లి పిర్యాదు మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


అసలేం జరిగిందంటే..?


సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి కథనం మేరకు.. నాగలాపురం మండలంలోని నందనం గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న మధురెడ్డి అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటి వద్ధకు వెళ్లాడు. అమ్మఒడి పథకం కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కావాలని అడుగ్గా.. బాలిక ఇంటి లోపలి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ తేబోయింది. ఆమె లోపలికి వెళ్లగానే.. ఆమె వెంటే వెళ్లిన వాలంటీర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. వెంటనే వాలంటీర్ బయటకు పరుగులు తీశాడు. వెంటనే సదరు బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.


తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే గ్రామ వాలంటీర్ పై వచ్చిన ఫిర్యాదు ఋజువు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారని ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. నిందితుడు మధురెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామన్నారు. మహిళలు, బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా సీఐ శివకుమార్ రెడ్డి హెచ్చరించారు.


కోనసీమ జిల్లాలో ఇటీవలే దారుణం.. బాలికతో ఫస్ట్ నైట్, వీడియోలు వైరల్


డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండల పరిధిలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మైనర్ బాలికకు తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే తొలి రాత్రి గడుపుతుండగా అశ్లీల చిత్రాలను తీసి వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన భర్తను అరెస్ట్ చేసినట్లు కాట్రేనికోన ఎస్సై టి. శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామానికి చెందిన మైనర్ బాలికను మల్లాడి వీరబాబు ఈ ఏడాది ఫిబ్రవరి 8న వివాహం చేసుకున్నాడు. 


కీచక భర్తకు 14 రోజులు రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్


మొదటి రాత్రి ఆమెతో ఏకాంతంగా గడిపిన చిత్రాలను భర్త తన సెల్ ఫోన్ లో తీసుకున్నాడు. భర్త వాటిని వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపి ప్రచారం చేశాడు. ఇది కాస్తా బయట పడడంతో బాలిక కుటుంబానికి తెలిసింది. దాంతో అల్లుడి నిర్వాకంపై ఫిబ్రవరి 20న బాధితురాలి తల్లి కాట్రేనికోన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముమ్మిడివరం సీఐ ఎం.జానకిరామ్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 28న నిందితుడు మల్లాడి వీరబాబు అరెస్ట్ చేసి బుధవారం ముమ్మిడివరం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.