Transgenders Dead Bodies Found In Kurnool: కర్నూలు (Kurnool) జిల్లాలో ముగ్గురు ట్రాన్స్ జెండర్ల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం గ్రామ శివారులో ఉన్న నగరవనం (Nagaravanam) చెరువులో తొలుత ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాలను పరిశీలించారు. అనంతరం చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని గుర్తించారు. మృతులు ఎవరు.? ఎలా చనిపోయారు అనేది మిస్టరీగా మారింది. ఎవరైనా చంపి చెరువులో పడేశారా.? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


చెరువులో పురిటి బిడ్డ మృతదేహం


అటు, నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో  ఆదివారం ఉదయం పురిటి బిడ్డ మృతదేహం బయటపడింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీ అయిన తర్వాత బిడ్డ మృతి చెందడంతో ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బిడ్డ మృతదేహాన్ని ఇక్కడ పడేశారా.? లేక బతికుండగానే పడేశారా.? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. బిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


గోదావరిలో విద్యార్థుల గల్లంతు


మరోవైపు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం గౌతమి గోదావరి బ్రిడ్జి వద్ద స్నానం కోసం దిగిన ముగ్గురు విద్యార్థులు  శనివారం గల్లంతయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. గల్లంతైన వారు రావులపాలెంకు చెందినసబ్బెళ్ల ఈశ్వరరెడ్డి, సత్తి సంపత్ రెడ్డి, పెంటా జయకుమార్ లుగా గుర్తించారు.


Also Read: Human Trafficking: ఉద్యోగాల పేరుతో మోసం - హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు