Telanli Crime New: ఓటీటీలో అప్పట్లో వచ్చిన ఓ డాక్యుమెంటరీ సంచలనంగా మారింది. కేరళలో జరిగిన ఓ యథార్థగథను తీసుకొని కర్రీ అండ్‌ సైనైడ్ పేరుతో దీన్ని నిర్మించారు. అందులో జల్సాలకు అలవాటు పడిన జాలీ అనే మహిళ తన ఫ్యామిలీని ఫ్రెండ్స్‌ను ఎలా చంపింది అనేది కథాంశం. ఆమె నాలుగేళ్ల వరకు పోలీసులకు చిక్కకుండా వీళ్లందర్నీ హతమార్చింది. ఈ డాక్యుమెంటరీ దేశంలోనే కాకుండా విదేశీయులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ అన్నట్టు తెనాలిలో సైనైడ్ మర్డర్స్ కలకలం రేపాయి. 


ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీసులు ముగ్గురు సైనైడ్ కిల్లర్స్‌ను అరెస్టు చేశారు. వారు ముగ్గురూ మహిళలే. ఈ మహిళలు ఎవరికీ అనుమానం రాకుండా నలుగురిని చంపేసిన విధానం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. ఇలా హత్యలు చేసిన ముగ్గురు మహిళల్లో ఇద్దరు తల్లీ కూతుళ్ళు కావడం మరో కోణం అన్నారు గుంటూరు SP సతీష్ కుమార్. రెండేళ్లలో మొత్తం నలుగుర్ని లేపేసిన ఈ సైనైడ్‌ కిల్లర్స్‌ మరో ముగ్గుర్ని చంపేందుకు ట్రై చేశారు. వారి అదృష్టం బాగుండి లాస్ట్ మినిట్‌లో బతికి పోయారు.


వరుస హత్యలు మొదలైంది ఇలా
తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వర అలియాస్ బుజ్జి అనే 32 ఏళ్ల మహిళ గతంలో వాలంటీర్‌గా పనిచేసింది. తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కంబోడియా దేశం వెళ్ళి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడింది. తిరిగి ఇండియా వచ్చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉండే తన అత్తగారు సుబ్బలక్ష్మిని మద్యంలో సైనైడ్ కలిపి తాగించి చంపేసింది. ఈ హత్యలో తన కన్నతల్లి బొంతు రమణమ్మ కూడా పాల్గొంది. బుజ్జి అత్తగారీ వద్ద ఉన్న డబ్బు,బంగారంతో పాటు ఆమె మీద ఉన్న ఆస్తి తనకు చెందుతుంది అనే దురాశతో ఈ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు


రెండో హత్య - ఈసారి థంప్స్‌ అప్‌లో సైనైడ్ కలిపి
ఎవరికీ తెలియకుండా తాము తీసుకున్న 20,000 రూపాయల అప్పు ఎగ్గొట్టడానికి అప్పు ఇచ్చిన నాగమ్మ అనే పక్కింటావిడ ను థంప్స్‌ అప్‌లో సైనైడ్ కలిపి చంపేశారీ తల్లీకూతుళ్ళు బుజ్జీ,రమణమ్మ. నాగమ్మను చంపేస్తే ఆమె అప్పు తిరిగి కట్టనవసరం లేకపోవడమే కాకుండా ఆమె ఇంట్లోని బంగారం, డబ్బు కూడా కొట్టేయొచ్చనేది బుజ్జి స్కెచ్. ఈ హత్య 2023 ఆగష్టులో చేశారు.


Also Read: పరాయి వ్యక్తితో మాట్లాడింద‌ని దారుణం, ఆ వ్యక్తితో వివాహితకు బలవంతంగా పెళ్లి!


మూడో హత్య - గ్యాంగులోకి కొత్త కిల్లర్ లేడీ 
కూతురితో కలిసి రెండు హత్యలు చేసిన రమణమ్మ ఈసారి మరో హత్య చేసింది. తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే అనే వ్యక్తిని మందులో సైనైడ్ కలిపి చంపారు. ఈ హత్యలో స్వయంగా హతుడి భార్య భూదేవి పాల్గొంది. మోషే రోజూ తాగివచ్చి భూదేవిని కొడుతున్నాడనీ తనకు తెలిసిన రమణమ్మతో చెబితే ఆమె ఈ హత్యకు పురిగొల్పింది . మోషే చనిపోయాక ఇంట్లో ఉన్న డబ్బు బంగారంతో పాటు ఇన్స్యూరెన్స్ డబ్బులో వాటా ఇచ్చేలా మాట్లాడుకుని మోషేను హత్య చేశారు. ఈ హత్యే ఏడాదే అంటే 2024 ఏప్రిల్‌లో జరిగింది


నాల్గో హత్య - కిల్లర్‌లను పట్టించిన నేరం
రెండు నెలల కిందట చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం శివార్లలో ఒక గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో వెళ్ళిన పోలీసులు మృతదేహం వద్ద కొంచెం సైనైడ్ కనుగొన్నారు. మృతదేహం దగ్గరున్న ఫోన్ ద్వారా ఆమె తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీకి చెందిన షేక్ నాగుర్ బీగా గుర్తించి ఆమె ఎక్కి వచ్చిన ఆటోను పట్టుకుని డ్రైవర్‌ను ప్రశ్నించారు. సోమసుందర పాలెం వంతెన వద్ద నాగూర్ బీ ఆటోను వడ్లమూడి వరకూ మాట్లాడుకుందని అయితే మధ్యలో మరో ఇద్దరు మహిళలు కలిసి వారిలో ఒకరు అదే ఆటోలో మరొకరు ఆటో వెనుక స్కూటీ పైన వడ్లమూడి వరకూ వచ్చారని డ్రైవర్ తెలిపాడు. మధ్యలో తనతో బ్రీజర్ కూడా కొనిపించారని ఆటోలో వచ్చిన మహిళను రజని పేరుతో పిలవడం విన్నానని చెప్పాడు. దీంతో రజనీ నీ ట్రాక్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఆమెతో పాటు వెనుక స్కూటీ పై వచ్చిన వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి కలిసి నాగూర్ బీ నీ నమ్మించి వడ్లమూడిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి బ్రీజర్ లో సైనైడ్ కలిపి తాగించి చంపేశారు అని తేల్చారు. 


నాల్గో హత్య కూడా నాగూర్ బీ వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసమే చేశారు అయితే ఈ ఇంటరాగేషన్ సందర్భంగా బుజ్జి అండ్ గ్యాంగ్ చేసిన మిగిలిన మూడు హత్యలు గురించి కూడా తెలియడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ హత్యల్లో పాల్గొన్న బుజ్జి,ఆమె తల్లి రమణమ్మ, రజనీ సహా సైనైడ్ అమ్మి పరోక్షంగా సహకరించిన వారిని కూడా అరెస్టు చేశామని గుంటూరు SP సతీష్ కుమార్ తెలిపారు . కర్రీ అండ్‌ సైనైడ్ డాక్యుమెంటరీ తోపాటు ఈ హత్యలు గురించి తెలిసిన వారంతా డైరెక్టర్‌కు మరో స్టోరీ దొరికిందని అంటున్నారు.


Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ప్రాణాలు తీసిందా? శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారుతున్న యువకుడి మృతి!