Mallareddy Agriculture university | హైదరాబాద్: ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో జరిగింది. తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ బిల్డింగ్ మీది నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు.


బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హరినాథ్ అనే మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. ఆపై ఓ ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగలడంతో విద్యార్థి హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థులు, యాజమాన్యం హరినాథ్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అతడు ఎందుకు పురుగుల మందు తాగి బిల్డింగ్ మీద నుంచి దూకాడు, ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.