శ్రీకాకుళంలో గంజాయిపై యుద్ధం మొదలైంది. గంజాయిరాయుళ్ళపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్దమయ్యారు. నిఘాను పటిష్టం చేసి, తనిఖీలు ముమ్మరం చేసారు. దొరికిన వాళ్ళని దొరికినట్లుగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. జాతీయ రహదారితో పాటు అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తనఖీలు ముమ్మరం చేయడంతో పాటు గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారి ద్వారా ఎక్కడెక్కడ నుంచి గంజాయి వస్తుందో తెలుసుకుని లింక్ లను కనిపెడుతూ నిందితులను అరెస్ట్ చేస్తున్నారు.


తాజాగా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలతో సంబందం ఉన్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి సేవించే మరో 8 మందిని గుర్తించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి గంజాయి ముఠా అరెస్ట్ వివరాలను వెల్లడించారు.


వన్ టౌన్ పోలీసులకి పట్టుబడ్డ గంజాయి ముఠాలో శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన వల్లంశెట్టి చందు అలియాస్ పవర్ చందు,మొండేటివీదికి చెందిన కోలా అరుణ్ కుమార్ అలియాస్ బిట్టు, మండలవీదికి చెందిన సైలాడ వేణుగోపాలరావు అలియాస్ వేణు, రెడ్డిక వీదికి చెందిన కొల్లి యశోదరావు అలియాస్ విజయ్ కుమార్ కొత్త దమ్మలవీదికి చెందిన చీకటి యోగేశ్వరరావు అలియాస్ అవతార్, మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన జామి శ్రీనివాసరావు, పెద్ద రెల్లివీదికి చెందిన జలగడుగుల కృష్ణ వంశీ, కోరాపుట్ జిల్లా పొత్తంగి బ్లాక్ కి చెందిన గుంత హరీష్, బంక జోసెఫ్ లు ఉన్నారు. అదేవిదంగా కిల్లంశెట్టి నిఖిల్, కానుకుర్తి పెరిన్ కుమార్ తుపాకుల సువార్త, సీరపు కౌశిక్ రెడ్డి, జలగడుగుల జయవర్ధన్ , బొడ్డేపల్లి ఢిల్లేశ్వరరావు,గంటల యశ్వంత్ గంటల సూర్యతేజలు గంజాయి సేవిస్తూ పోలీసులకి దొరికారు. వీరికి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ను పోలీసులునిర్వహించనున్నారు.


యువ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న పోలీసులను ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక పోలీసుబృందాల ద్వారా నిఘా పెట్టారు. యువకులు ఎక్కువగా గంజాయిసేవిస్తున్న డెన్ లను గుర్తించి ఆకస్మిక దాడులు నిర్వహించాలని సూచించారు. గంజాయి సేవించే వారిని పట్టుకునివారి ద్వారా వారు ఎక్కడెక్కడ గంజాయిని కొనుగోలు చేస్తున్నది ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో గంజాయిని ఎవరు విక్రయిస్తున్నారు... వారు ఎక్కడనుంచి గంజాయిని అక్రమంగా దిగుమతి చేస్తున్నారు, ఎక్కడ కొనుగోలు చేసి తెస్తున్నారు...ఏజెన్సీలో గంజాయి విక్రయిస్తున్న వారెవ్వరు అన్న సమాచారాన్ని పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. సరకు సరఫరా చేస్తున్న వారికోసం పోలీసుల వేట మొదలుపెట్టారు. గంజాయి కలిగి ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం గంజాయి డెన్ లపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.


శ్రీకాకుళం నగరంతో పాటు నగర శివార్లలో విచ్చలవిడిగా యువత గంజాయి సేవిస్తున్నారని పోలీసులకు సమాచారం అందుతోంది.  యువత మత్తులో జోగుతున్న తీరుతో పాటు ఆ మత్తులో వారు రెచ్చిపోతున్నవైనంపై పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలోని మాస్ ఏరియాలుగా పేరు పొందిన అన్ని వీధులలో ఓ గంజాయి బ్యాచ్ ఉంది. ఒక్కో బ్యాచ్ ఒక్కో లీడర్ కనుసన్నలలోనే నడుస్తోంది. లీడర్ గా ఉండే వ్యక్తి ఆ బ్యాచ్ ముఠాకు గంజాయి సరఫరా చేస్తుంటాడు. నాగావళి పరివాహక ప్రాంతంతో పాటు తోటపాలెం, అరసవల్లిరోడ్డు, తండేవలస రోడ్డు, డచ్ బంగ్లా, పొన్నాడ తదితర ప్రాంతాలతోపాటు నగరంలోని పార్క్ లు గంజాయి సేవించేందుకు డెన్ లుగా మత్తుకి బానిసైన వారు వినియోగిస్తున్నారు. చివరికి శ్మశానవాటికలనుకూడాగంజాయిడెన్లుగావినియోగించుకుంటున్నారు. చివరికి ముఖ్యకూడళ్ళలోనే ఆటోలువంటివి పార్క్ చేసుకుని గంజాయి దమ్ము కొట్టేస్తున్నారు. ఆ మత్తులో వీదుల్లో యువకులు అలజడి రేపుతున్నారు. బైక్ లనుఅతివేగంగా నడుపుతూ హల్ చల్ చేస్తున్నారు. అర్థరాత్రుల వరకూ నగరంలోబలాదూర్ తిరుగుతున్నారు. మత్తులో చిన్నచిన్న దొంగతనాలకి పాల్పడుతున్నారు.


Also Read: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాను అరెస్ట్ చేయడంతో, ఆ బ్యాచ్ లను ఉలిక్కిపడేలా చేసింది. హెచ్చరిక తరువాత శ్రీకాకుళంలో తొలిసారిగా పోలీసులు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేయడంతో అమ్మకాలు సాగించే వారిలో టెన్షన్ మొదలైంది. జిల్లా ఎస్పీమహేశ్వర రెడ్డి మాత్రం శ్రీకాకుళంలో గంజాయి విక్రయాలకి చెక్ పెడతామని కృతనిశ్చయంతో ఉన్నారు. గంజాయి విక్రయదారులు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడినా, విక్రయించినా, గంజాయి సేవించినా కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా పోలీసు బాస్ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. యువత మత్తుబారిన పడకుండా గంజాయి అనే మాట విన్పించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం వాసులు కోరుతున్నారు.