Srikakulam News: శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసేన కార్యాలయంపై దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. జనసేన అధినేత పవన కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్  అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు.. తమ అభ్యంతరాన్ని తెలిపారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఎమ్మెల్సీ దువ్వాడ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడటాన్ని భరించలేని దువ్వాడ వర్గీయులు జనసేన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్, కంప్యూటర్లను పగుల గొట్టారు. బ్యానర్లను చింపేశారు. దీని పై స్పందించిన జనసేన నాయకులు.. వైసీపీ బరితెగింపుకు ఇది ఒక నిదర్శనం అంటూ కామెంట్లు చేశారు. విషయం తెలిసుకున్న బీజేపీ నాయకులు జనసేన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు.



ఇటీవలే వైసీపీపై చెప్పుతో పవన్ విజృంభణ! 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీపై చేసే విమర్శల డోసును మరింతగా పెంచారు. వైఎస్ఆర్ సీపీ నేతలను ‘‘కొడకల్లారా?, వెధవల్లారా?, సన్నాసుల్లారా?’’ అంటూ పదే పదే ఈ విపరీతమైన పదజాలం వాడుతూ దూషించారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తన కాలి చెప్పు పైకి తీసి చూపుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి, వారికి తన ఆస్తులు కూడా ఇచ్చి మరొకర్ని పెళ్లి చేసుకున్నానని అన్నారు. ‘చట్ట ప్రకారం విడాకులు ఇచ్చిన వారికి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ.5 కోట్లు ఇచ్చాను. రెండో భార్యకు కూడా నా ఆస్తి రాసిచ్చా. అంతేకానీ, వైఎస్ఆర్ సీపీ నాయకుల మాదిరిగా ఒకర్ని పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫినీలతో తిరగడం లేద’ని అన్నారు. ‘వెధవల్లారా ఒక్కొక్కడ్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొడతా’ అని తీవ్రమైన పదజాలంతో దూషించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం (అక్టోబర్ 18) పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రసంగం మొదటి నుంచి చివరి వరకూ పరుష పదజాలం వాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై విరుచుకుపడ్డారు.


‘‘నాకు రాజకీయం తెలియనుకుంటున్నారా? ఒక్కొక్కర్నీ నిలబెట్టి తోలు ఒలుస్తా, చెప్పుతో కొడతా కొడకల్లారా!’’ అంటూ పవన్ కల్యాణ్ మరో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా అందరూ పవన్ కల్యాణ్ లోని మంచితనాన్నే చూశారని, ఇకపై తన నుంచి తమ నుంచి యుద్ధమే చూస్తారని తేల్చి చెప్పారు. ఈ స్ఫూర్తి తనకు తెలంగాణ పోరాటం నుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రి కూడా అప్పట్లో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్ గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలకు మంచిగా చెప్తే వినపడదని అన్నారు.


8 ఏళ్లలో రూ.120కోట్లు సంపాదించా - పవన్


‘‘నేను స్కార్పియో వాహనాలు కొంటే ఎవరు ఇచ్చారని అడిగారు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. గత 8 ఏళ్లలో నేను ఆరు సినిమాలు చేశాను. వాటి ద్వారా నాకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. దాని ద్వారా రూ.33 కోట్లకు పైగా ట్యాక్సులు కట్టాను. నా పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తీసి పార్టీ ఆఫీసు కోసం ఇచ్చాం. రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.12 కోట్లు ఇచ్చా. అయోధ్య రామాలయం నిర్మాణం కోసం రూ.30 లక్షలు ఇచ్చాను. పార్టీ పెట్టిన దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్స్ లో రూ.15.58 కోట్ల కార్పస్‌ ఫండ్‌ డొనేషన్స్ వచ్చాయి. కౌలు రైతు భరోసా యాత్ర కోసం రూ.3.5 కోట్లు వచ్చాయి. ‘నా సేన కోసం నా వంతు’ పిలుపునకు గానూ మరో రూ.4 కోట్లు అందాయి’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.