Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం మండాది వద్ద  ఉపాధి హామీ కూలీలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.  


అసలేం జరిగింది? 


శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఉపాధి హామీ కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. బ్రేక్ ఫెయిల్ అయి లారీ వేగంగా కూలీలపైకి దూసుకెళ్లింది. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి  తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  ఈ ప్రమాదం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురు కూలీలు మందాడ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాద ఘటనతో మందాడ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. నిర్లక్ష్యంగా లారీ నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అతి వేగంగా వచ్చిన లారీ రెప్పపాటులో కూలీలపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. 


ములుగు జిల్లాలో ఆటో బోల్తా, మహిళ మృతి 


ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామంలో ఆటో అతివేగంగా వచ్చి అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో మహిళ స్పాట్లోనే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దుల గూడెం గ్రామానికి చెందిన 17 మంది కూలీలను పాసెంజర్ టీఎస్28టీ 2286 నంబర్ గల ఆటోలో తాడ్వాయి మండలం మేడారం సమీపంలో నాట్లు వేయడానికి ఓ డ్రైవర్ కూలీలను తీసుకెళ్తున్నాడు. అయితే డ్రైవర్ ఆటోను అతి వేగంతో నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నార్లాపూర్ సమీపంలోకి రాగానే పీహెచ్సీ వద్ద గల మూల మలుపులో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లెబోయిన సునీత(38) అక్కడికక్కడే చనిపోయింది. మరో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా జ్యోతి, బోగమ్మ, విజయ, లలిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మేడారం విధుల్లో ఉన్న సీఐ రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పోలీసు వాహనాల్లోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.