Software Engineer Forceful Death In Durgam Cheruvu: మాదాపూర్‌లోని (Madhapur) దుర్గంచెరువులో (Durgam Cheruvu) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ (25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 24న (బుధవారం) ఆఫీసుకు వెళ్లిన బాలాజీ అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ సైతం స్విచ్చాఫ్ చేసి ఉండడంతో స్నేహితులను విచారించారు. అయినా, ఫలితం లేకపోవడంతో ఈ నెల 25న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఐడీ కార్డు ఆధారంగా..


దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా.. ఈ నెల 24న రాత్రి 8:30 గంటలకు బాలాజీ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల్లో దుర్గంచెరువు కేబుల్ మీదుగా కిందకి దిగినట్లు కనిపించడంతో గాలించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం దుర్గంచెరువులో బాలాజీ మృతదేహం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా మృతున్ని గుర్తించారు. ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తోన్న బాలాజీ.. ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయగా.. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేక బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన రాయదుర్గం పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Cellphone Charging: తడి చేతులతో సెల్ ఫోన్ ఛార్జింగ్ - విద్యుత్ షాక్‌తో బాలిక మృతి, ఎక్కడంటే?