Girl Died While Putting Mobile Charging In Khammam: తడి చేతులతో మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ గురైన ఓ బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో (Khammam District) జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ దంపతులకు కుమార్తె అంజలీ కార్తీక (9), కుమారుడు వెంకట గణేష్ ఉన్నారు. ఉదయం అంజలి తన తండ్రి వద్ద మొబైల్ తీసుకుని ఛార్జింగ్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తడి చేతులతో ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలింది.


బాలికను గమనించిన తల్లిదండ్రులు సపర్యలు చేసి వెంటనే అదే గ్రామంలోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంజలి గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


విద్యార్థిని ఆత్మహత్యాయత్నం


మరోవైపు, ఖమ్మం జిల్లా ముస్తఫానగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టీచర్స్ వేధింపుల వల్లే విద్యార్థిని ఇలా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 


Also Read: Hyderabad News: ఓఆర్ఆర్‌పై మూత్రం పోస్తుండగా బాలుడు దుర్మరణం