Secunderabad Protests : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవుల సుబ్బారావుని నరసరావుపేట నుంచి హైదరాబాద్ తరలించారు. సోమవారం ఆవుల సుబ్బారావు ఇళ్లు, ఆర్మీ అకాడమీలలో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు న్యాయవాది అలెగ్జాండర్  మాట్లాడుతూ సికింద్రాబాద్ ఘటనలో ఆవుల సుబ్బారావు ప్రమేయం లేదన్నారు. అతని పాత్రపై ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. డిఫెన్స్ అకాడమీల మధ్య పోరులో భాగంగా సుబ్బారావుపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అక్రమంగా కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తామన్నారు న్యాయవాది అలెగ్జాండర్. 


కుట్రపూరిత అల్లర్లు 


సైనిక నియామకాల్లో అగ్నిపథ్‌ స్కీమ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లు కుట్రపూరితమని రైల్వే పోలీసులు రిమాంట్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మారిపోతామని, కేంద్ర ప్రభుత్వ ఆస్తులు, రైల్వేస్టేషన్లను ధ్వంసం చేయడం ద్వారా దీన్ని అడ్డుకోవాలని ఆర్మీ అభ్యర్థులు నిర్ణయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్నిపథ్ స్కీమ్ అమల్లోకి వచ్చిన వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకున్నారని గుర్తించారు. సికింద్రాబాద్ తర్వాత ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లలలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. 


రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు 


ఆందోళనకారులు వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లోని 12 డిఫెన్స్ కోచింగ్ అకాడమీల్లో శిక్షణ పొందుతున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ ఆందోళన కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్  విధ్వంసంలో మొత్తం 56 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కామారెడ్డికి చెందిన మధుసూదన్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు చేర్చారు. 56 మంది నిందితులు ఆర్మీ ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ లో అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దానికి వ్యతిరేకంగా వాట్సాప్  గ్రూపులు క్రియేట్ చేసుకుని అల్లర్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీమ్ పెట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్స్, చలో సికింద్రాబాద్ ARO3 గ్రూప్, మరికొన్ని గ్రూపులు క్రియేట్ చేశారని వెల్లడించారు. ఈ గ్రూపు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు ఈ విధ్వంసానికి సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.