Hyderabad News: గత నెల 29న సికింద్రాబాద్ లో ఒక వ్యక్తి హత్య, మరో వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసును మార్కెట్ పోలీసులు ఛేదించారు. నిందితుడు నిజామాబాద్ కు చెందిన మోసిన ఖాన్ అని గుర్తించి.. అతణ్ని మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఉత్తర మండలం అదనపు డీసీపీ జి. మధుసూధన్ రావు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను మధుసూధన్ రావు వెల్లడించారు.


గత నెల 29న అర్థరాత్రి యశోద హాస్పిటల్ సమీపంలో ఒక వ్యక్తి తనపై దాడి చేసి రూ.800 రూపాయలు లాక్కొని పారిపోయాడని నితిలేష్ ఇచ్చిన ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న మార్కెట్ పోలీసులు ఆధారాలు సేకరించారు. అప్పటికే పారిపోయిన నిందితుడు మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో అతణ్ని వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించినట్లుగా డీసీపీ వివరించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. అతనిపై హత్య, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు బోధన్, నిజామాబాద్ కు చెందిన మోసిన ఖాన్ గా గుర్తించి, ప్రత్యేక టీంను రంగంలోకి దింపారు.


నిజామాబాద్ లో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మద్యానికి బానిసై మద్యం కొనడానికి డబ్బుల కోసం ఇటువంటి ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. బోధన్ లో కూడా చోరికి పాల్పడి జైలులో శిక్ష అనుభవించాడని, సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాడికి పాల్పడ్డట్లు కేసు నమోదయ్యింది అన్నారు.