India vs England 2nd Test India won by 106 runs : వైజాగ్‌(Vizag) వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌(England)ను 292 పరుగులకు ఆలౌట్‌ చేసి 106 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో క్రాలే పోరాడినా మిగిలిన బ్యాటర్లు అనుకున్నంత మేర రాణించలేకపోయారు.  బౌలర్లు సమష్టిగా రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. అశ్విన్ 3, బుమ్ర 3 వికెట్లతో సత్తా చాటారు.

 

విజయం సాధించిందిలా.....

వర్‌నైట్‌ స్కోరు ఒక్క వికెట్‌ నష్టానికి 67 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించింది. క్రాలే మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 73 పరుగులు చేసిన క్రాలేను కుల్‌దీప్‌ అవుట్‌ చేశాడు. ఎల్బీ కోసం టీమిండియా అప్పీలు చేయగా.. అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. డీఆర్‌ఎస్‌ తీసుకున్న భారత్‌కు ఫలితం సానుకూలంగా వచ్చింది. దీంతో 194 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ ఐదో వికెట్‌ను నష్టపోయింది. వెంటనే ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో బెయిర్ స్టో ఎల్బీగా ఔట్ అయ్యాడు. అంపైర్‌ ఔట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్‌ డీఆర్‌ఎస్‌ తీసుకుంది. సమీక్షలోనూ ‘అంపైర్స్‌ కాల్’ రావడంతో బెయిర్‌స్టో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ఓలీ పోప్‌ క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో 23 పరుగులు చేసిన ఓలీ పోప్‌  ఔటయ్యాడు. అనంతరం బెన్ ఫోక్స్‌, హార్ట్‌లీ పోరాడారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ రాణించాడు.

 

చరిత్ర సృష్టించిన క్రికెట్‌ జీనియస్‌

 ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్‌ కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ ఘ‌న‌త చంద్రశేఖ‌ర్ పేరిట ఉంది. చంద్రశేఖ‌ర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు ప‌డ‌గొట్టగా ఈ రికార్డును అశ్విన్‌ బద్దలుకొట్టాడు. అశ్విన్‌ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీరిద్దరి త‌రువాత మూడో స్థానంలో అనిల్ కుంబ్లే 92 వికెట్లతో ఉన్నాడు. ఇంగ్లాండ్ జ‌ట్టుపై ఇప్పటి వ‌ర‌కు ఏ టీమ్ఇండియా బౌల‌ర్ కూడా వంద వికెట్లు తీయ‌లేదు. అశ్విన్ ఇప్పటి వ‌ర‌కు ఇంగ్లాండ్ పై 97 వికెట్లు తీశాడు. అత‌డు మ‌రో 3 వికెట్లు గ‌నుక తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన‌ మొద‌టి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఇక రెండు జ‌ట్ల మ‌ధ్య అత్యధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా జేమ్స్ అండ‌ర్స్‌న్ ఉన్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచులో అశ్విన్ మ‌రో మూడు విక‌ెట్లు తీస్తే.. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 96 టెస్టుల్లో 497 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు.

 

యశస్వీ పేరిట రికార్డులే రికార్డులు

వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌ అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ... అజేయ ద్వి శతకంతో టీమిండియాను భారీ స్కోరు అందించాడు. 290 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్...19 ఫోర్లు, 7 సిక్సులతో 209 పరుగులు చేసి అవుటయ్యాడు.  ఈ మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ మార్క్‌ అందుకున్న జైస్వాల్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ సెంచరీతో కదం తొక్కాడు.