Sangareddy News : సంగారెడ్డిలో అయ్యప్ప స్వాముల సన్నిధానంపై కన్నేశాడు ఓ దొంగ. అయ్యప్ప సన్నిధానంలో 14 సెల్ ఫోన్లు చోరీ చేశాడు.  15 మంది స్వాములు సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో సన్నిధానం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఆదివారం రాత్రి పూజలు ముగించుకుని స్వాములు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ దొంగ చాకచక్యంగా సన్నిధానంలోనికి ప్రవేశించాడు. అతడిని గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించాడు. అటు ఇటు తిరిగి 14 సెల్ ఫోన్లు, లక్షన్నర నగదు, బైక్ కొట్టేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాకు చిక్కాయి. తెల్లవారుజామున లేచిన అయ్యప్ప స్వాములు టైమ్ చూసేందుకు సెల్ ఫోన్ కోసం వెతగ్గా కనిపించలేదు. అందరి సెల్ ఫోన్లు మాయం కావడంపై సీసీ ఫుటేజ్ చూస్తే చోరీ దృశ్యాలు కనిపించాయి. వెంటనే సంగారెడ్డి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే వ్యక్తి పటాన్ చెరులో కూడా అయ్యప్ప స్వాముల సెల్ ఫోన్లు చోరీ చేసినట్లు తెలిసింది. అక్కడ కూడా చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మరి అయ్యప్ప స్వాముల సన్నిధానాలపై కన్నేసిన దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 



(బాధిత అయ్యప్ప స్వాములు) 


ప్రియురాలి కోసం దోపిడీ నాటకం


పదేళ్లుగా పత్తి వ్యాపారం చేస్తున్నాడు అతడు. నమ్మకంగా ఉంటూ రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని మిల్లు యజమానులకు విక్రయిస్తుంటాడు. అయితే ఈ నెల పదిహేడో తేదీన అతనిపై దుండగలు దాడి చేసి రెండు లక్షల రూపాయలను అపహరించుకుపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరా తీస్తే అతని గురించి అందరూ మంచివాడనే చెప్పారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు... ఆ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కొడుక్కి రెండు లక్షలు ఇవ్వడం కోసం దారి దోపిడీ స్కెచ్ వేశాడని నిర్థారించారు.  గుంటూరు రూరల్ మండలం కంతేరుకు చెందిన గంధం శ్రీను పదేళ్లుగా పత్తి వ్యాపారం చేస్తున్నాడు. రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని మిల్లు యజమానులకు విక్రయిస్తుంటాడు. అలా వచ్చిన లాభంతో జీవనం సాగిస్తున్నాడు. తాను ఆటో కొనుగోలు చేసి రైతుల వద్ద కొన్న పత్తిని వ్యాపారులకు, మిల్లు యజమానులకు చేరవేస్తుంటాడు. అయితే ఈ నెల 17వ తేదీన జాతీయ రహదారిపై పత్తి దించి వస్తున్న శ్రీనును రెండు బైక్ లపై వెంబడించిన దుండగులు దాడి చేసి రెండు లక్షల రూపాయలను అపహరించుకుపోయారు. ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి వెళ్లిన శ్రీను ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్ని ఆధారాలు సేకరించారు. ఎక్కడా దోపిడీ జరిగినట్లు ఆనవాళ్లు లభించలేదు. మరోవైపు శ్రీను గురించి అటు రైతులు గాని, ఇటు వ్యాపారులు గాని వ్యతిరేకంగా చెప్పలేదు. దీంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్ గా మారింది. 


బయటపడ్డ వివాహేతర సంబంధం




ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు..విచారణలో శ్రీను వివాహేతర సంబంధం గురించి తెలిసింది. ఆ కోణంలో తీగ లాగితే డొంక కదిలింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కొడుక్కి పత్తి అమ్మగా వచ్చిన రెండు లక్షల రూపాయలను ఇచ్చి పంపించాడు శ్రీను. ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టటానికి దోపిడీ జరిగినట్లు నాటకం ఆడాడు. దీంతో శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. పత్తి అమ్మగా వచ్చిన డబ్బులను ముందుగా తన ప్రియురాలి కొడుక్కి ఇచ్చి పంపించాడు. అనంతరం హైవే పై వస్తూ దోపిడీ జరిగినట్లు తనకు తానే గాయం చేసుకొని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా అన్ని విషయాలు బయటకొచ్చాయి. శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు మధ్యవర్తులకు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే క్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సురేష్ చెప్పారు. లేకుంటే రైతులు నష్టపోవాల్సి ఉంటుందన్నారు.