Hyderabad Crime News: హైదరాబాద్‌ (Hyderabad) యూసుఫ్‌గూడ(yusufguda)లో జరిగిన పుట్టా రాము(Putta Ramu) అలియాస్‌ సింగోటం రామన్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఏడుగురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళతోపాటు ఆమె కుమార్తె కూడా ఉంది. 


నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము అలియాస్‌ సింగోటం రామన్న... నిజాంపేటలోని బెవర్లీ ఫార్మ్స్‌ విల్లాలో నివాసం ఉంటున్నారు. బుధవారం (ఫిబ్రవరి 7వ తేదీ) రాత్రి 11 గంటల సమయంలో యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో హసీనా అనే మహిళ ఇంట్లో... రామన్న దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో వచ్చిన 11 మంది... పుట్టా రామును హత్య చేసి పారిపోయారు. రామన్న బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు  పోలీసులు దర్యాప్తు చేశారు. పుట్టా రాము హత్య జరిగిన ఇంట్లో ఉంటున్న 40ఏళ్ల హిమాంబీ, ఆమె కుమార్తె నసీమాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హత్యకు ముందు రాముకు... నసీమా నుంచి ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్టు విచారణలో  తేలింది. దీనిపై ఆమెను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించారు. అలాగే... సీసీ ఫుటేజీని కూడా సేకరించారు. హత్య తర్వాత నిందితులు పారిపోతున్న దృశ్యాలను గమనించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.  8మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. హసీనా, ఆమె కుమార్తె సాయంతో హనీట్రాప్‌ చేయించి... రామన్నను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. జీడిమెట్లలోని రాంరెడ్డినగర్‌లో ఉంటున్న డ్రైవర్‌ మణికంఠ ఏ1గా, చింతల్‌కు చెందిన అతడి  స్నేహితుడు దారావత్‌ వినోద్‌కుమార్‌ను ఏ2గా తేల్చారు.


జీడిమెట్లలో ఉంటున్న మణికంఠ రౌడీషీటర్‌. ఇదివరకు... రాము, మణికంఠ, వినోద్‌ స్నేహితులు. ఆ తర్వాత వ్యాపార విషయంలో... రాము, మణికంఠ గొడవలు వచ్చాయి. రెండేళ్ల క్రితం మణికంఠపై దాడి చేశాడు రామన్న. మణికంఠ మొహానికి తీవ్ర  గాయాలై ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో రాము జైలుకు వెళ్లి.. బెయిల్‌పై వచ్చాడు. రాము తనను చంపేస్తాడన్న భయపడ్డారు మణికంఠ. రాము తనను చంపేలోపే... తానే రామును చంపేయాలని ప్లాన్‌ చేశారు. మరోవైపు...  వ్యభిచార గృహం నిర్వహిస్తున్న హిమాంబీతో శారీరక సంబంధం పెట్టుకున్న రాము.. ఆమె కుమార్తె నసీమాను కూడా లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం నసీమా ప్రియుడైన వినోద్‌కు తెలిసింది. నసీమా, ఆమె తల్లి... ఈ విషయాన్ని  మణికంఠకు, వినోద్‌కు చెప్పారు. వారంతా కలిసి పుట్టా రామును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పక్కాగా స్కెచ్‌ వేసుకున్నారు. వారి ప్లాన్‌లో భాగంగా... బుధవారం రాత్రి హిమాంబీ కూతురు నసీమాతో రాముకు ఫోన్‌ చేయించారు. పుట్టారామును వారి ఇంటికి రమ్మని పిలిచారు. దీంతో లక్ష్మీనరసింహనగర్‌ వచ్చిన పుట్టా రాము నసీమాతోపాటు గదిలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న మణికంఠ, వినోద్‌తో సహా 11 మంది గదిలోకి వెళ్లి.. నసీమా ముందే విచక్షణా రహితంగా రాముని పొడిచేశారు. అతడి మర్మాంగాలను కోసేశాడు వినోద్‌. తీవ్రంగా గాయపడిన రాము అక్కడికక్కడే చనిపోయాడు. రాము హత్య తర్వాత.. అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు.


రాము హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులంతా జీడిమెట్ల రాంరెడ్డినగర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. మణికంఠ, వినోద్‌తోపాటు హత్యకు సహకరించిన మహ్మద్‌ ఖైసర్‌, బండ శివ, కప్పాల నిఖిల్‌, తున్న కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. వీరితోపాటు హిమాంబీ, ఆమె కుమార్తె నసీమాను కూడా అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. హిమామ్‌బీపై వ్యభిచార నిర్వహణ కేసు కూడా పెట్టారు పోలీసులు.