Railway Police Arrested Young Man Who Thefting In Trains In Bapatla: ఆ యువకుడు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. సెల్ ఫోన్‌లో వీడియోల ద్వారా దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. బయట చోరీలు చేస్తే ఈజీగా దొరికిపోతామని భావించి రైళ్లనే టార్గెట్ చేశాడు. సినిమాల్లో రైళ్ల దొంగతనాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసి అలానే చేస్తూ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల (Bapatla) జిల్లా చీరాల (Cheerala) మండలం వాడరేవు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ వ్యసనాలకు బానిసై.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి రైళ్లల్లో దొంగతనాలు చేశాడు. 


పోలీసుల నిఘా


రైళ్లల్లో ప్రయాణికులు నిద్రిస్తోన్న సమయంలో వారి బ్యాగులు, బంగారం, ల్యాప్ టాప్స్, సెల్ ఫోన్స్, ఇతర విలువైన వస్తువులను చోరీ చేశాడు. తెనాలి నుంచి నెల్లూరు వరకూ ప్రయాణిస్తూ ఈ తతంగం కొనసాగించాడు. అయితే, గత కొంతకాలంగా చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులు ఎక్కువ కావడంతో పోలీసులు నిఘా ఉంచారు. నిందితుడిని వెంకటేశ్వర్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.3.81 లక్షల విలువైన 62 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 సెల్ ఫోన్లు, 4 ల్యాప్ టాప్స్, ఒక ఐ ప్యాడ్, 3 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. రైళ్లల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులను నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు.


Also Read: Muchumarri Minor Case: ముచ్చుమర్రి బాలిక కేసులో ఊహించని పరిణామం - వ్యక్తి అనుమానాస్పద మృతి