Medical Student Suicide: ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నా...ర్యాగింగ్(Ragging) భూతం వీడటం లేదు. విద్యావ్యవస్థలో కాలనుగుణంగా ఎన్నో మార్పులు వచ్చినా...ఈ ర్యాగింగ్ జాడ్యం మాత్రం వదలడం లేదు. అమాయక విద్యార్థులు ర్యాగింగ్ ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతుండగా...మరికొందరు బలవన్మరణానలకు(Suicide) పాల్పడుతున్నారు. కరీంనగర్లో ఓ పీజీ విద్యార్థిని ఈ ర్యాగింగ్ కాటుకు బలైపోయింది.
ర్యాగింగ్ కలకలం
కరీంనగర్(Karimnagar) ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్యవిద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. తోటి విద్యార్థులు ర్యాగింగ్(Ragging) చేయడం వల్లే ఆర్తీ సాహు బలవన్మరణం పాలైందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్(Hyderabad)లోని అబిడ్స్కు చెందిన రాజేంద్రసాహు కుమార్తె ఆర్తీసాహు(Aarthi saahu)....కరీనంగర్ వైద్య కళాశాలలో(Medical College) పీజీ సెకండీయర్ చదవుతోంది. అయితే కొంతకాలంగా తోటివిద్యార్థులు ఆమెను ర్యాగింగ్ చేస్తున్నారని...తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారంటూ ఆణె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. అయితే వారు ఆమెకు నచ్చజెప్పి కళాశాలకు పంపిస్తున్నారు. మరికొన్నిరోజులు ఆగితే చదువు పూర్తవుతుందని...ఈ సమయంలో వారితో గొడవలు వద్దని బుజ్జగించారు. అయితే జనవరి 30న హాస్టల్ రూమ్ లో ఆర్తీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా....గమనించిన విద్యార్థులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కీర్తిసాహు కన్నుమూసింది.
అయితే తన కుమార్తె బలవన్మరణానికి తోటి విద్యార్థి ఆశిష్(Ashish) కారణమని ఆర్తీ తండ్రి రాజేంద్రసాహు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కళాశాలలో చేరినప్పటి నుంచి ఆశిష్...ఆర్తీని ర్యాగింగ్ చేస్తున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండు నెలల క్రితం అందరి ముందు చెప్పమీద కొట్టాడని ఆయన పోలీసులకు తెలిపాడు. ఈ విషయం తమతో చెబితే...మేమే సర్దుకుపొమ్మని చెప్పామని ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. రోజురోజుకు ఆశిష్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఆర్తీ తమతో చెప్పేదన్నారు. జనవరి 28న తోటి వైద్య విద్యార్థులందరూ అశీష్ ఇంటికి వెళ్లగా... ఆర్తీ మాత్రం వెళ్లలేదని ఆయన వివరించారు. అందరూ వస్తే నువ్వు ఎందుకు రాలేదని ఆర్తీసాహును ఆశిష్ కోప్పడంతో...జనవరి 29న ఒంటరిగా ఆమె ఆశిష్ ఇంటికి వెళ్లిందని అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ...తిరిగి హాస్టల్కు వచ్చిన మరుసటి రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆర్తిసాహు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆర్తీ మరణం వెనక డాక్టర్ ఆశిష్ హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని...విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఆయన పోలీసులను (Police)కోరాడు.
ముఖ్యంగా ఈ ర్యాగింగ్ భూతం వైద్యకళాశాలల్లోనే ఎక్కువగా ఉండటం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితమే నల్గొండలోనే వైద్య కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడ్డారని ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులపై వేటుపడింది. అలాగే ఖమ్మం వైద్యకళాశాలలోనూ నూతనంగా చేరిన విద్యార్థి హెయిర్స్టైల్ బాగోలేదని...మరోసారి ఇలా కనిపిస్తే ఊరుకోమంటూ సీనియర్ విద్యార్థులు హెచ్చరించడం కలకలం సృష్టించింది. పాలమూరులోనూ విద్యార్థులను సీనియర్లు గోడకుర్చీ వేయించడం వంటి ఘటనలు బయపడ్డాయి. ప్రతి వైద్య కళాశాలలోనూ యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నప్పటికీ....అవి తీసుకునే చర్యలు నామమాత్రమేనని విద్యార్థులు వాపోతున్నారు. కమిటీకి ఫిర్యాదు చేసినా...చిన్నచిన్న విషయాలు పట్టించుకోవద్దని బాధితులకు హితబోధలు చేస్తున్నారు.
ర్యాగింగ్కు పాల్పడటం క్రిమినల్ చర్య అంటూ న్యాయస్థానాలు సహా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెచ్చరించినా...సీనియర్ విద్యార్థుల ఆగడాలు ఆగడంలేదు. అటు కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లకు సైతం ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నా...ర్యాగింగ్ భూతం విజృంభిస్తూనే ఉంది.