Puttaparthi Municipal Commissioner Dies: శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం, రైలు కింద పడి పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం జరిగింది. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ రైలు కింద పడి మృతి చెందారు. కడప  రైల్వే గేటు వద్ద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కడప నగరపాలక కార్యాలయంలో సూపరిండెంట్ గా గతంలో విధులు నిర్వహించారు ముని కుమార్. మూడు నెలల కిందట డిప్యూటేషన్ పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, 2 రోజుల కిందట ముని కుమార్ పుట్టపర్తి నుంచి కడపకు వచ్చారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఆయన రైలు కింద పడి మృతి చెందారు.



అసలేం జరిగింది..
ముని కుమార్ గతంలో కడప నగర పాలక కార్యాలయంలో సూపరింటెండెంట్ గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనకు మూడు నెలల క్రితం పుట్టపర్తికి డిప్యూటేషన్ పై మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కడప నుంచి పుట్టపర్తి వెళ్లి అక్కడ మున్సిపల్ కమిషనర్‌గా ముని కుమార్ సేవలు అందిస్తున్నారు. ఏదో పని నిమిత్తం రెండు రోజుల కిందట ముని కుమార్ పుట్టపర్తి నుంచి కడపకు వెళ్లినట్లు సమాచారం. కానీ అంతలోనే విషాదం జరిగింది. కడప శివారులోని రాయచోటి రైల్వేగేటు వద్ద రైలు కిందట పడి ముని కుమార్ మృతి చెందారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అనేది తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా ప్రాథమికంగా భావిస్తున్నారు.