Punganuru Police Hit The Child Murder Case: చిత్తూరు జిల్లా పుంగనూరులో (Punganuru) ఏడేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలే చిన్నారి హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి హత్య ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. చిన్నారి తండ్రి ఓ మహిళకు రూ.3.5 లక్షలు అప్పుగా ఇచ్చాడని.. అది తిరిగి చెల్లించాలని ఆ మహిళను బెదిరించడం, తిట్టడ, కోర్టులో కేసు వేస్తానని చెప్పడంతో ఆమె అతనిపై పగ పెంచుకున్నట్లు చెప్పారు. ఇంటి వద్ద ఆడుకుంటోన్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం పాపకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారని చెప్పారు. 


హత్య తర్వాత చిన్నారిని బైక్‌పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారని ఎస్పీ తెలిపారు. నిందితులు రేష్మ, ఆమె తల్లి హసీనా, సహకరించిన బాలుడు అఖిల్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చిన్నారి మిస్ అయిన రోజునే సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారని.. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. అటు, కొన్ని ఛానల్స్ చిన్నారి మృతిపై తప్పుడు ప్రచారం చేశాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో మీడియా బాధ్యతగా ఉండాలని అన్నారు.


బాధిత కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్


అటు, బాధిత కుటుంబానికి నేతలు అండగా నిలిచారు. చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. చిన్నారి తండ్రితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 


బాలిక మృతిని వైసీపీ రాజకీయం చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతిపై పోలీసులు పటిష్ట విచారణ చేపట్టారని అన్నారు. బాలికపై అత్యాచారం చేశారని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం రిపోర్టులో ఉందని చెప్పారు. చిన్నారి హత్యపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసి వారి కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.


ఇదీ జరిగింది


చిత్తూరు జిల్లా పుంగనూరులో గత నెల 29న ఆదివారం రాత్రి ఇంటి వద్ద ఆడుకుంటోన్న ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక యువత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ బృందాలు ఉబేదుల్లా కాంపౌండ్, చెంగ్లాపురం రోడ్డు పరిసర ప్రాంతాల్లో సంచరించాయి. ఎస్పీ మణికంఠ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. చివరకు ఈ నెల 2వ తేదీన (బుధవారం) సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు నిర్థారించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. చివరకు చిన్నారిని హత్య చేసిన నిందితులను గుర్తించారు.


Also Read: Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న